పవన్ కల్యాణ్ ఆదేశాలు బేఖాతర్: జగన్తో చనువుగా..ఆప్యాయంగా రాపాక: సభలో ముచ్చట్లు.. !
అమరావతి: జనసేన పార్టీకి చెందిన ఏకైక శాసనసభ్యుడు రాపాక వరప్రసాద్.. మరోసారి చర్చనీయాంశమయ్యారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో చనువుగా మాట్లాడుతూ కనిపించారు. చాలాసేపటి వరకు ఆయన వైఎస్ జగన్ పక్కనే కూర్చున్నారు. వారిద్దరి మధ్య చాలాసేపు ముచ్చట్లు కొనసాగాయి. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఒకట్రెండుసార్లు.. రాపాక భుజాన్ని తట్టడం కనిపించింది.

పవన్ కల్యాణ్ ఆదేశాలు బేఖాతర్..
అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులపై ఎలా స్పందించాలనే విషయాన్ని తెలియజేస్తూ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ఓ ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన జారీ అయిన కొద్ది సేపటికే రాపాక వరప్రసాద్.. వైఎస్ జగన్తో సన్నిహితంగా మెలుగుతూ కనిపించారు. ఫలితంగా- అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తన వైఖరి, తాను అనుసరించే విధానం ఏమిటనేది రాపాక పరోక్షంగా పార్టీ అగ్ర నాయకత్వానికి తెలియజేసినట్టయింది.

బిల్లులకు వ్యతిరేకంగా ఓటు వేయాలంటూ..
అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఆరంభమైన తరువాత జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. రాపాకకు ఆదేశాలను జారీ చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే ఏపీ వికేంద్రీకరణ, ప్రాంతాల సమాన అభివృద్ధి చట్టం-2020, అమరావతి మెట్రో అభివృద్ధి చట్టం-2020లకు వ్యతిరేకంగా ఓటు వేయాలని పార్టీ అధ్యక్షుడి హోదాలో పవన్ కల్యాణ్.. రాపాక వరప్రసాద్ను ఆదేశించారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని పార్టీలోని వివిధ స్థాయిల్లో ఏకాభిప్రాయం వ్యక్తమైందని, దీనికి అనుగుణంగా నడచుకోవాలని సూచించారు.

ఈ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే..
ఈ ప్రకటన వెలువడిన కొద్ది సేపటికే రాపాక వరప్రసాద్.. వైఎస్ జగన్తో మాట్లాడుతూ కనిపించారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన సభ్యులైనా సరే..అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న సమయంలో ముఖ్యమంత్రిని కలుసుకోవడం, ఆయనకు వినతిపత్రాలను అందజేయడం సాధారణంగా చోటు చేసుకునే విషయమే. ఇదివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పలువురు ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబును కలుసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి.

బిల్లుకు అనుకూలంగా ఓటు ఖాయమే..?
ఇక్కడి స్థితిగతులు వేరు.. రాపాక ఇప్పుడున్న పరిస్థితులు వేరు. జనసేన పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా నడుచుకోవడం, వైఎస్ జగన్ను చాలా సందర్భాల్లో పొగడ్తల్లో ముంచెత్తడం తెలిసిన విషయమే. పవన్ కల్యాణ్ తాజాగా జారీ చేసిన ఆదేశాల్లో ఏ ఒక్క దాన్ని కూడా రాపాక వ్యతిరేకించట్లేదు.. పైగా వాటిని ఆయన స్వాగతిస్తున్నారు కూడా. ఈ పరిస్థితుల్లో రాపాక.. వైఎస్ జగన్తో చనువుగా వ్యవహరించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పార్టీ నిర్ణయానికి విరుద్ధంగా.. బిల్లుకు అనుకూలంగా ఓటు వేయడం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications