విజయవాడ దుర్గగుడిలో కరోనా కలకలం- ఈవో సహా 18 మందికి పాజిటివ్...
నిత్యం భక్తులతో కళకళలాడే విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో కరోనా కల్లోలం రేపుతోంది. కరోనా వ్యాప్తి కారణంగా రెండున్నర నెలలకు పైగా గుడిని మూసేసిన అధికారులు.. తాజాగా కేంద్రం ఆంక్షల సడలింపుతో తిరిగి దర్శనాలు ప్రారంభించారు. అయితే పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తున్నా కరోనా వ్యాప్తి చెందుతుండటంతో వాటిలోనూ కోతలు పెట్టారు.
ఇదంతా సాగుతుండగానే తాజాగా ఆలయ కార్యనిర్వహణాధికారి సురేష్ తో పాటు మరో 18 మంది సిబ్బందికీ కరోనా సోకినట్లు తేలింది. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో వీరికి వైరస్ సోకినట్లు నిర్దారించారు.ఇవాళ అసలే శ్రావణ శుక్రవారం కావడం, భక్తులు ఎక్కువగా ప్రత్యేక పూజల కోసం తరలివస్తుండటంతో కరోనా భయాలు మరింత పెరిగాయి. ఇప్పటికే ఆలయంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న దాఖలాలు కనిపిస్తున్నా భక్తుల రాక మాత్రం తగ్గడం లేదు.
Recommended Video
దీంతో అధికారులు కూడా తలలు పట్టుకోవాల్సిన పరిస్దితి. భక్తులను వెనక్కిపంపలేని పరిస్దితుల్లో దర్శనాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారులతో పాటు సిబ్బందికీ కరోనా సోకిన నేపథ్యంలో ఆలయాన్ని కంటైన్ మెంట్ జోన్ గా ప్రకటించే విషయంలో ప్రభుత్వంతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.