త్వరలో గ్రామ సచివాలయాల పరిధిలోనే భూముల రిజిస్ట్రేషన్లు : మంత్రి కొడాలి నాని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ సచివాలయాల ఏర్పాటు జరిగి సంవత్సరం అయిన కారణంగా నేడు ఏపీ లోని మంత్రులు సచివాలయాల వ్యవస్థపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి కొడాలి నాని కృష్ణాజిల్లా గుడివాడలో మాట్లాడుతూ ప్రతి గ్రామంలోనూ ప్రజల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. స్థానికంగా ఉన్నత చదువులు చదివి నిరుద్యోగులుగా ఉన్న యువతకు ఉపాధి కల్పించడంతో పాటు, 5 కోట్ల మంది ప్రజలకు ఉపయోగపడే విధంగా సచివాలయ వ్యవస్థ ఏర్పాటైందని కొడాలి నాని కొనియాడారు.
జగన్ పై అందరికీ కన్ఫ్యూజన్ .. లోగుట్టు స్వరూపానందకే ఎరుక :కొడాలి నానీకి రఘురామ చురక
ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఏపీ గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ పని తీరు అద్భుతంగా ఉందని కొనియాడారు అని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఏపీ భారత దేశానికి ఆదర్శంగా ఉంటుందని ఆయన అన్నారు.జాతిపిత మహాత్మా గాంధీ జయంతి రోజున ఏపీలో గ్రామ సచివాలయాలు వ్యవస్థను ఏర్పాటు చేశామని, రాబోయే రోజుల్లో గ్రామ సచివాలయాలలో భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా ప్రారంభిస్తామని కొడాలి నాని స్పష్టం చేశారు.
Recommended Video
రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు ద్వారా రైతులకు ఎంతో ఉపయోగం జరుగుతోందని పేర్కొన్న కొడాలి నాని ఏపీ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉందని వ్యాఖ్యానించారు. దేశంలో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఏపీ తరహాలో గ్రామ సచివాలయాలు,వాలంటీర్ల వ్యవస్థ దిశగా ఆలోచన చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పటం మనకు గర్వకారణమని కొడాలి నాని పేర్కొన్నారు. గ్రామ సచివాలయాలలో ఉన్న సిబ్బందికి ప్రతి మూడు నెలలకు ఒక పరీక్ష పెట్టి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేయనున్నట్లుగా మంత్రి కొడాలి నాని తెలిపారు. రాష్ట్రంలోని ప్రజలందరూ గ్రామ సచివాలయ వ్యవస్థతో సంతోషంగా ఉన్నారని గ్రామీణ స్థాయిలో అందరికీ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని కొడాలి నాని స్పష్టం చేశారు.