అవసరమైతే కాళ్లు పట్టుకోవడం కూడా తెలియాలి: బొత్స
ప్రభుత్వంలో అవినీతి జరిగితే ముఖ్యమంత్రి, ఉద్యోగులు సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆ పరిస్థితి లేదన్నారు. విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రాష్ట్రస్థాయి ప్రథమ మహా జనసభ నిర్వహించారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్ తోపాటు ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు, ఉద్యోగులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ.. ఉద్యోగులంటే ప్రభుత్వానికి వ్యతిరేకత లేదని, ఏ విషయమైనా కూర్చొని పరిష్కరించుకోవాలన్నదే తన విధానమన్నారు. సర్వీస్ రూల్స్ సహా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెస్తే పరిష్కరిస్తామన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలను జీఓఎంలో చర్చించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అవసరమైతే కాళ్లు పట్టుకొనైనా సమస్యను పరిష్కరించుకునే నేర్పు ఉద్యోగ సంఘాలకు ఉండాలని హితవు పలికారు. సామ, దాన, భేద దండోపాయాలు సమస్యల పరిష్కారంలో సహజమేనని, ఉద్యోగ సంఘాలు నేరుగా దండోపాయానికి వెళ్లడం సరికాదని, సమస్యల పరిష్కారానికి మంత్రుల కమిటీ అండగా ఉంటుందని బొత్స హామీ ఇచ్చారు.

గ్రామ, వార్డు సచివాలయాల్లో 500కు పైగా సేవలు అందిస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు. స్పష్టమైన సర్వీస్ రూల్స్ ఇస్తూ పదోన్నతులు కల్పిస్తామని, అందుకు రోడ్మ్యాప్ సిద్ధమవుతోందని చెప్పారు. శానిటేషన్ ఉద్యోగులకు త్వరలో వారాంతపు సెలవు ప్రకటించబోతున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications