జగన్ ఢిల్లీ పర్యటన వేళ.. మోదీకి కేశినేని నాని విజ్ఞప్తి
Bharat Ratna: మాజీ ప్రధానమంత్రి, దివంగత పాములపర్తి వెంకట నరసింహారావుకు.. అత్యున్నత పౌర పురస్కారం లభించింది. ఆయనకు భారతరత్న అవార్డును ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్దిసేపటి కిందటే తన అధికారిక ఎక్స్ అకౌంట్లో దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశారు.
పీవీ నరసింహారావుతో పాటు మాజీ ప్రధాని, దివంగత చౌదరి చరణ్ సింగ్కు భారతరత్న పురస్కారానికి నామినేట్ చేసినట్లు తెలిపారు. ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ పేరును భారతరత్న పురస్కారం కోసం ఎంపిక చేసినట్లు వెల్లడించారు.

ఇదివరకే బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్, మాజీ ఉప ప్రధానమంత్రి లాల్ కృష్ణ అద్వానీలకూ ఈ అవార్డును కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఎల్ కే అద్వానీ మినహా మిగిలిన ముగ్గురికీ మరణానంతరం ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది. ఇప్పటివరకు మొత్తం అయిదుమందికి భారతరత్న పురస్కారం లభించినట్టయింది.
భారతరత్న పురస్కారానికి పీవీ పేరును నామినేట్ చేయడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, విజయవాడ లోక్సభ సభ్యుడు కేశినేని నాని హర్షం వ్యక్తం చేశారు. దీన్ని స్వాగతించారు. ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడైన పీవీ నరసింహారావుకు భారతరత్న అవార్డు లభించడం గొప్ప విషయమని వ్యాఖ్యానించారు.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎన్టీ రామారావుకూ భారతరత్న పురస్కారాన్ని ప్రకటించాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే తన అధికారిక ఎక్స్ అకౌంట్లో దీనికి సంబంధించిన కొంత సమాచారాన్ని పోస్ట్ చేశారు కేశినేని నాని.
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు ప్రజలు గర్వించదగ్గ నాయకుడు ఎన్టీఆర్కు కూడా భారతరత్న పురస్కారాన్ని ప్రదానం చేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు. తెలుగు రాష్ట్రాలు, భారతీయ చలనచిత్ర రంగం అభివృద్ధికి ఎన్టీఆర్.. చిరస్మరణీయమైన సేవలు చేశారని గుర్తు చేశారు.
ఎన్టీఆర్ చేసిన విశేష కృషి.. తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని కేశినేని నాని అన్నారు. ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారంతో ఎన్టీఆర్ను సత్కరించమే.. ఆయనకు మనం ఇవ్వగలిగిన ఘన నివాళిగా పేర్కొన్నారు. ఎన్టీఆర్కు భారతరత్న పురస్కారం లభించాలనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు చిరకాల కోరిక అంటూ గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications