జగన్, చంద్రబాబు ప్రతీకార రాజకీయాలు..! అగమ్యగోచరం కానున్న పదేళ్ల పాలన...!!
హైదరాబాద్/అమరావతి : చిన్న రాష్ట్రాలు అభిృద్దికి సౌలభ్యంగా ఉంటాయన్న రాజ్యాంగ నిర్మాత బాబా సాహబ్ అంబేద్కర్ నినాదం ఆంధ్రప్రదేశ్ లో అబాసుపాలవుతోంది. రాజకీయ పార్టీల మధ్య నెలకొన్న వైరుధ్యాల వల్ల విలువైన సమయం వృధా అవుతుంది తప్ప అభివృద్ది అనేది కనుచూపు మేరలో కనిపించడం లేదనే చర్చ జరుగుతోంది. అవశేష ఆంధ్ర ప్రదేశ్ కు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు పై ప్రస్తుత వైసీపి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు చూస్తుంటే ఐదేళ్ల విలువైన సమయం వృధా అయ్యిందేమోననే సందేహాలు తలెత్తుతున్నాయి. అంతే కాకుండా రెడ్డొచ్చే మొదాలాయే అనే సామెతకు తగ్గట్టు ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డి మళ్లీ కొత్తగా అభివృద్ది పనులకు శ్రీకారం చుడుతున్నారు.
అమరావతి విషయంలో తేడా వస్తే 28న రాష్ట్ర బంద్.. రాజధాని తుది నిర్ణయంపై టెన్షన్..: టీడీపీ
అటకెక్కిన అభివృద్ది.. ప్రతీకార రాజకీయాల మధ్య నలుగుతున్న అమరావతి..
చంద్రబాబు చేసిన అభివృద్దికి కొనసాగింపుగా జగన్ పయత్నాలు చేసి ఉండి ఉంటే వేగవంతమైన అభివృద్దికి అవకాశం ఉండేది. కాని చంద్రబాబు చేసింది అసలు అభివృద్దే కాదని, మళ్లీ మొదటినుండి మొదలు పెట్టాల్సిందేననే ధోరణిలో జగన్ మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. పోలవరం, అమరావతి, రాజధాని నిర్మాణం, విదేశీ పెట్టుబడులు, పరిశ్రమల స్థాపన, ఇసుక పాలసీ, సంక్షేమ పథకాల అమలు వంటి అన్ని రంగాలలో మళ్లీ నూతన పద్దతిలో ముందుకు వెళ్తున్నారు ప్రస్తుత సీఎం జగన్. దీంతో అవశేష ఆంధ్ర ప్రదేశ్ అభివృద్దిలో ఇతర రాష్ట్రాలతో ఎప్పుడు పోటీ పడుతుందో తెలియని అగమ్యగోచర పరిస్ధితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ఆంధ్ర ప్రదేశ్ లో ప్రతీకార రాజకీయాలు తారా స్థాయిలో నడుస్తున్నాయి. కక్ష పూరిత రాజకీయాల ముందు అభివృద్ది అధోగతి పాలవుతోందనే చర్చ కూడా జరగుతోంది.
టీడిపి ప్రభుత్వం పై వైసిపి మండిపాటు.. భ్రమలు కల్పించారన్న సీఎం జగన్..
ఐదు సంవత్సరాల చంద్రబాబు పాలనను ప్రజావేదికను కూల్చేసినట్టు ఐదు నిమిషాల్లో నేల మట్టం చేసారు జగన్ మోహన్ రెడ్డి. ఐదేళ్లుగా చంద్రబాబు తన అనుయాయుల కోసం పని చేసారు తప్పితే రాష్ట్రాభివృద్ది కోసం పని చేయలేదని జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అభివృద్దినంతా గ్రాఫిక్స్ లో చూపించి ప్రజలకు అభూత కల్పనలు కల్పించి అమరావతిని కాస్త భ్రమరావతిగా మార్చారని వైసిపి ప్రభుత్వం చంద్రబాబుపై దుమ్మెత్తి పోస్తోంది. ప్రపంచ స్ధాయి రాజధాని నిర్మాణం కోసం రైతులు స్వచ్చందంగా 33 వేల ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగిస్తే ఆ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేందుకు టీడిపి నేతలు ఉపయోగించుకున్నారని జగన్ ఆరోపిస్తున్నారు.
జగన్ కక్షపూరత రాజకీయాలు.. ఘాటుగా విమర్శిస్తున్న టీడిపి...
అమరావతి రాజధాని వ్యవహారంలో ఇంతగా అవినీతి చోటుచేసుకుంది కాబట్టే అభివృద్ది కార్యక్రమాలకు మళ్లీ మొదటినుండి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉందని వైసీపి వివరణ ఇస్తోంది. అంటే చంద్రబాబు పాలించిన ఐదేళ్ల విలువైన సమయం బూడిదలో పోసిన పన్నీరేనా అని ఏపి ప్రజలు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వైసీపి ప్రభుత్వ వాదన ఇలా ఉంటే తెలుగుదేశం పార్టీ నేతలు మరోలా స్పందిస్తున్నారు. ఒక సామాజిక వర్గం మీద ఉన్న ఆక్రోశంతో జగన్ మోహన్ రెడ్డి ఉన్మాదిలా వ్యవహరిస్తున్నారని, మొత్తం రాష్ట్రాన్ని అదోగతి పాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడుతున్నారు టీడిపి నేతలు. అవినీతి జరిగిందని నిరూపిస్తే దేనికైనా సిద్దమని చెప్పుకొస్తున్నారు. అమరావతి రాజధాని అంశంలో ప్రజల్లో లేనిపోని అనుమానాలను కల్పించారని, అభివృద్ది చేస్తామని వచ్చిన సింగపూర్ కన్సార్టియంను కావాలనే వెనక్కు పంపించారని ఆరోపిస్తున్నారు.
ఏపిలో విచిత్ర రాజకీయం.. అధోగతి పాలవుతున్న అభివృద్ది..
ప్రశాంతంగా ఉన్న మూడు ప్రాంతాల ప్రజలను అభివృద్ది వికేంద్రీకరణ పేరుతో రెచ్చగొట్టారని తెలుగుతమ్ముళ్లు మండిపడుతున్నారు. ఇదంతా రాజకీయ ప్రతీకారం కోసం జగన్మోహన్ రెడ్డి అడుతున్న నాటకంలో భాగమని వివరణ ఇస్తున్నారు. తాజాగా మూడు ప్రాంతాల అభివృద్దికి మూడు రాజధానుల పేరుతో జగన్ కొత్త డ్రామాలకు తెర లేపారని విమర్శిస్తున్నారు. ఐతే చంద్రబాబు చేతిలో ఐదేళ్లు ముందుకు వెళ్లిందో, వెనక్కు వెళ్లిందో తెలియని అమరావతి మరో ఐదేళ్ల పాటు కొత్త ప్రభుత్వం చేయబోయే ప్రయోగాలను రుచి చూడబోతోంది. మరో నాలుగేళ్లు ఇదే ప్రతీకార రాజకీయాల మద్య పాలన ఎంతవరకు నలుగుతుందో ఏపి ప్రజలు ప్రత్యక్ష్యంగా చూడబోతున్నారు. అభివృద్ది కాకుండా ప్రతీకార రాజకీయాలకే ప్రాధాన్యత నెలకొంటే మాత్రం విలువైన పది సంవత్సరాల పాలనా సమయం వృధాకాక తప్పదని నిర్ధారణ అవుతోంది. అలా జరిగితే ఆంధ్ర ప్రదేశ్ అధోగతి పాలవ్వక తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి.