కొలిక్కిరాని ఆర్టీసీ చర్చలు ..సీఎం కేసీఆర్ మెలికతో ఏపీఎస్ఆర్టీసీకి నష్టం .. సీఎం జగన్ నిర్ణయమేంటో ?
ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు పునరుద్ధరణపై నిన్న హైదరాబాద్ లోని బస్ భవన్ లో జరిగిన చర్చలు కొలిక్కి రాలేదు. ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య కరోనా వ్యాప్తి నేపద్యంలో విధించిన లాక్ డౌన్ సందర్భంగా బస్సు సర్వీసులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. అయితే కేంద్రం తిరిగి దేశవ్యాప్తంగా అంతర్ రాష్ట్రాల వద్ద బస్సు సర్వీసుల పునరుద్ధరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్న నేపథ్యంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు బస్సు సర్వీసులు నడపడానికి చర్చలు జరుపుతున్నాయి. నిన్న జరిగిన చర్చల్లో స్పష్టత వస్తుందని భావిస్తే అవి మరోమారు పెండింగ్ పడ్డాయి .
అంతరాష్ట్ర రవాణాపై ఎటూ తేలని తెలుగు రాష్ట్రాల అధికారుల చర్చలు
హైదరాబాద్ బస్ భవన్ లో రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల మధ్య మరోసారి చర్చలు జరిపారు . ఈ భేటీకి ఏపీఎస్ఆర్టీసీ నుండి ముగ్గురు ఈడీలు ,ఆపరేషన్ హెడ్ బ్రహ్మానంద రెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. అంతర్ రాష్ట్ర రవాణానే ఏకైక అజెండాగా జరిగిన ఈ చర్చల్లో తెలంగాణా ప్రభుత్వం అంతరాష్ట్ర బస్సు సర్వీసుల విషయంలో ఏపీ ప్రభుత్వంతో డీల్ చేసుకోవాలని చూస్తుంది. సీఎం కేసీఆర్ రెండు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు సమంగా నడపాలని, ఒకే పరిమాణంలో కిలోమీటర్ల మేర తిరిగేలా ఒప్పందం చేసుకోవాలని అధికారులకు సూచించారు .
ఏపీఎస్ఆర్టీసీ తెలంగాణాకు నడిపే కిలోమీటర్లు తగ్గించుకోవాలని తెలంగాణా ప్రతిపాదన
తెలంగాణా అధికారులు ఇదే విషయాన్ని ఏపీ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళారు . తెలంగాణ రాష్ట్రానికి ఏపీఎస్ఆర్టీసీ నుండి రోజు 2.65 లక్షల కిలోమీటర్ల బస్సులు నడిపేందుకు ప్రతిపాదన అందించింది. అయితే తెలంగాణ ఆర్టీసీ ఏపీకి 1.16 లక్షల కిలోమీటర్ల బస్సు సర్వీసులను నడుపుతోంది. ఈ నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ కూడా తెలంగాణ రాష్ట్రం ఎన్ని కిలోమీటర్లు నడుపుతున్నదో, అన్ని కిలోమీటర్ల మేరే బస్సు సర్వీసులు నడపాలని, కిలోమీటర్లు తగ్గించుకోవడమో, బస్సు సర్వీసులను తగ్గించుకోవడమో చేయాలని ఏపీ అధికారులకు, తెలంగాణ అధికారులు సూచించారు.
తెలంగాణా ప్రతిపాదనతో ఏపీఎస్ ఆర్టీసీకి నష్టం
దీంతో ఈ వ్యవహారం ఎటు తెగక సమావేశం మరోమారు వాయిదా పడింది. రాష్ట్రం విడిపోక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీలో తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర పరిధిలోని డిపోల బస్సులు ఎక్కువగా తిరిగేవి. రాష్ట్రం విడిపోయాక కూడా ఇంతకాలం అలాగే కొనసాగుతూ వచ్చింది. కానీ తెలంగాణా ఆర్టీసీకి ఏపీఎస్ఆర్టీసీ బస్సు సర్వీసులు ఎక్కువగా తిరగటంతో నష్టం వస్తున్న కారణంగా సీఎం కేసీఆర్ సమానంగా బస్సులు నడపాలనే ప్రతిపాదన తెరమీదకు తీసుకొచ్చి ఆ విధంగా డీల్ చేసుకోవాలని చెప్పటంతో ఇప్పుడు ఏపీ అధికారులు సందిగ్ధంలో పడ్డారు.
Recommended Video
కేసీఆర్ పెట్టిన మెలికపై జగన్ నిర్ణయం ఎలా ఉంటుందో !
తెలంగాణా ప్రతిపాదనకు ఓకే అంటే ఏపీఎస్ఆర్టీసీకి నష్టం వస్తుంది. అందుకే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు . దీంతో చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. మరి ఈ వ్యవహారంలో సీఎం కేసీఆర్ పెట్టిన మెలికకు సీఎం జగన్ ఏం నిర్ణయం తీసుకుంటారో అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే బస్ భవన్ విషయంలో కూడా తెలంగాణా , ఏపీ రాష్ట్రాల మధ్య విభజన పంచాయితీ కొనసాగుతుంది. ఇప్పుడు ఈ చిక్కుముడి ఎలా వీడుతుందో వేచి చూడాలి .