మాకొద్దీ ఎన్నికలు- ఏపీ హైకోర్టులో వరుస పిటిషన్లు- మధ్యాహ్నం ఆన్లైన్ విచారణ
ఏపీలో ఎన్నికల కమిషన్ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తున్న రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఉద్యోగ సంఘాలు, ఇతరులు హైకోర్టును ఆశ్రయించారు. శనివారం ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు.. ఇవాళ దాఖలైన మిగతా పిటిషన్లతో కలిపి విచారించేందుకు సిద్ధమవుతోంది.
ఏపీలో పంచాయతీ ఎన్నికలకు అనుకూలం, వ్యతిరేకంగా దాఖలైన పలు పిటిషన్లపై హైకోర్టు మధ్యాహ్నం రెండు గంటల 15 నిమిషాలకు ఆన్లైన్ ద్వారా విచారణ చేపట్టబోతోంది. ప్రస్తుతం హైకోర్టుకు సంక్రాంతి సెలవుల కారణంగా పనిచేయడం లేదు. కానీ అత్యవసర పిటిషన్లు దాఖలు కావడంతో వెకేషన్ బెంచ్ వీటిని విచారించబోతోంది. కరోనా, ఇతర పరిస్ధితులు, సెలవులను దృష్టిలో ఉంచుకుని ధర్మాసనం ఆన్లైన్ విధానంలో ఈ పిటిషన్లు విచారించాలని నిర్ణయించింది.
పంచాయతీ ఎన్నికలను వ్యతిరేకిస్తూ హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయగా.. ఉద్యోగ సంఘాలు కూడా స్టే ఇవ్వాలనే విజ్ఞప్తితో ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేస్తున్నాయి. దీంతో మధ్యాహ్నం వరకూ దాఖలైన పిటిషన్లను కలిపి ఒకేసారి విచారించాలని హైకోర్టు నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం మధ్యాహ్నం ఆన్లైన్ విచారణకు పిటిషనర్లు, న్యాయవాదులు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో కరోనా సందర్భంగా కూడా హైకోర్టు ఆన్లైన్ విధానంలోనే పలు కేసుల విచారణ నిర్వహించింది. మరోవైపు పంచాయతీ ఎన్నికలపై హైకోర్టులో అనుకూల తీర్పు రాకపోతే సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.