వైఎస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే.. దాసరి జైరమేష్ సోదరుడు
హైదరాబాద్: తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫ్యాక్స్ ద్వారా పంపించారు. శుక్రవారం ఉదయం ఆయన ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్ లో వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఆయన చేతుల మీదుగా పార్టీ కండువాను కప్పుకొన్నారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త, విజయ్ ఎలక్ట్రికల్స్ సంస్థ ఛైర్మన్ దాసరి జైరమేష్ కు ఆయన స్వయానా తమ్ముడు. గతంలో బాలవర్ధన రావు కృష్ణాజిల్లా గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు. 1999, 2009 ఎన్నికల్లో ఆయన గన్నవరం స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి, విజయం సాధించారు. 2004లో ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. వల్లభనేని వంశీకి టికెట్ ఇచ్చింది. అప్పటి నుంచి బాలవర్ధన రావు టీడీపీలో పెద్దగా క్రియాశీలకంగా లేరు. ప్రస్తుతం ఆయన విజయా డెయిరీ డైరెక్టర్ గా ఉన్నారు.

సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కాదని టీడీపీ బాలవర్ధన రావుకు టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. దీనితో ఆయన పార్టీ ఫిరాయించాలని నిర్ణయించుకున్నారు. ఆయన సోదరుడు దాసరి జై రమేష్ ఇటీవలే వైఎస్ఆర్ సీపీలో చేరుతున్నట్టు ప్రకటించడంతో బాలవర్ధన రావు కూడా అన్నబాటలోనే నడిచారు.
దాసరి జైరమేష్ ను వైఎస్ఆర్ సీపీ విజయవాడ లోక్ సభ బరిలో దింపడం దాదాపుగా ఖాయమైంది. దీనితో బాలవర్ధన రావుకు గన్నవరం టికెట్ దక్కవచ్చని తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో గన్నవరం స్థానం నుంచి వైఎస్ఆర్ సీపీ తరఫున పోటీ చేసిన దుత్తా రామచంద్రరావు ఓడిపోయారు. ప్రస్తుతం ఆయనకు మరోసారి టికెట్ ఇచ్చే అవకాశాలు లేవు. దీనితో బాలవర్ధన రావు అభ్యర్థిత్వం ఖాయం కావచ్చని సమాచారం.












Click it and Unblock the Notifications