వంగవీటి సంచలన కామెంట్స్- సొంత కులాన్ని తిట్టడం అడ్డమైనోళ్లకు ఫ్యాషన్-టార్గెట్ పేర్ని ?
ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగుతున్న పోరులో మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసే క్రమంలో మంత్రి పేర్నినాని చేసిన వ్యాఖ్యలు ఇంకా కలకలం రేపుతూనే ఉన్నాయి. అదే సమయంలో ఆయన కాపులపై చేసిన వ్యాఖ్యలపైనా వివాదం కొనసాగుతోంది. ఇవాళ ఖమ్మం జిల్లా పర్యటనలో టీడీపీ నేత వంగవీటి రాధా పరోక్షంగా స్పందించారు. సొంత కులాన్ని తిట్టడం ప్రతీ అడ్డమైనోడికీ ఫ్యాషనైపోయిందంటూ రాధా చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారన్న దానిపై చర్చ జరుగుతోంది.
పవన్ వర్సెస్ వైసీపీ పోరు
ఏపీలో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్ లైన సినిమా టికెట్ల వ్యవహారంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఆయనకు కౌంటర్ ఇచ్చే క్రమంలో మంత్రి పేర్నినాని చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల్లో మంత్రి పేర్నినాని చేసిన కాపుల ప్రస్తావన సొంత కులంలోనూ చిచ్చు రేపుతోంది. మేంమేం.. అంటూ నాని చేసిన ఆ వ్యాఖ్యలపై కాపులు రగిలిపోతున్నారు. ఇప్పటికే పేర్నినానిపై కాపు సంఘాలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇదే క్రమంలో టీడీపీ కాపు నేత వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
పేర్నినానికి వంగవీటి స్ట్రాంగ్ కౌంటర్
ఖమ్మం జిల్లాలో ఎర్రుబాలెం మండలం కొత్తపాలెంలో తండ్రి వంగవీటి మోహనరంగా విగ్రహం ఆవిష్కరణకు వచ్చిన వంగవీటి రాధా.. సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు పుట్టిన కులాన్ని తిట్టడం ప్రతి అడ్డమైనోడికి ఫ్యాషన్ అయిపోయిందంటూ నిప్పులు చెరిగారు. వాళ్లేదో గొప్పగా భావిస్తూ... పుట్టిన కులాన్ని వెటకారం చేస్తున్నారని రాధా వ్యాఖ్యానించారు. ఈ కులం వారంతా ఐక్యంగా ఉంటే ప్రభుత్వాలనే పడగొట్టే సత్తా ఉందని గుర్తు చేశారు. ఐకమత్యమే బలం.. ఉన్నవారిని అయినా కాపాడుకోండని రాధా పిలుపునిచ్చారు. అయితే రాధా ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారన్న చర్చ జరుగుతోంది. తాజాగా కాపుల్లో పుట్టి కాపులపై వ్యాఖ్యలు చేశారంటూ జనసేన నేతలు పేర్నినానిని టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో వంగవీటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
కాపునేతలకు కీలక సూచన
తన తండ్రి వంగవీటి మోహనరంగాను అన్ని వర్గాల ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని రాధా గుర్తు చేశారు. తరాలు మారినా, యుగాలు మారినా ధరిత్రి ఉన్నంత వరకు రంగా గారు ఉంటారన్నారు. రంగా కాపులకు ఆరాధ్యదైవమైతే... అన్ని వర్గాల పేదల గుండె చప్పుడన్నారు. మన నాయకుడు రంగాని మనం కాపాడుకోలేక పోయామని, ఇప్పుడు అయినా ఆవేశం తగ్గించి ఆలోచనతో ఉన్న నాయకులను అయినా కాపాడుకోమని కోరుతున్నానని వంగవీటి రాధా కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో కాపుల్ని ఏకం చేసేందుకు రాధా ఈ సూచన చేసినట్లు తెలుస్తోంది.
Recommended Video
గేరు మారుస్తున్న వంగవీటి రాధా
ఏపీలో వైసీపీ వర్సెస్ కాపులుగా మారుతున్న పోరులో మరోసారి వంగవీటి రాధా యాక్టివ్ అవుతున్నారు. వరుస పర్యటనలతో కాక రేపుతున్నారు. ఆయన వెళ్లిన ప్రతీ చోటా కాపులు మంత్రి పేర్నినాని వ్యాఖ్యల్ని ఆయనకు గుర్తు చేస్తున్నారు. దీంతో పేర్నినానితో పాటు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాధా వారికి హామి ఇస్తున్నారు. ఇప్పటికే గుడివాడలో మంత్రి కొడాలి నానిపై 2024 ఎన్నికల్లో బరిలోకి దిగుతానని అనుచరులకు సంకేతాలు ఇస్తున్న వంగవీటి రాధా.. అదే క్రమంలో మిగతా చోట్ల కూడా కాపుల్ని ఏకం చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు టీడీపీ-జనసేన పొత్తు వార్తల నేపథ్యంలో రాధా గేరు మార్చడం సంచలనం రేపుతోంది.