టీడీపీలో చిచ్చుపెట్టిన అసేంబ్లీ ఫర్నిచర్! కోడెలపై వర్ల రామయ్య ఫైర్.. పార్టీ ప్రతిష్ఠ దెబ్బతిన్నదంటూ
విజయవాడ: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, అసెంబ్లీ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ రావు అసెంబ్లీ ఫర్నిచర్ ను తన సొంత అవసరాల కోసం వినియోగించుకోవడంపై సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. పలువురు నాయకులు కోడెల శివప్రసాద్ చేసిన పనిని తప్పు పడుతున్నారు. ఆయన చర్యల వల్ల పార్టీ ప్రతిష్ఠ దెబ్బతిన్నదని వ్యాఖ్యానిస్తున్నారు. స్పీకర్ గా పనిచేసిన వ్యక్తి ఇలాంటి పని చేయడం ఎంత మాత్రమూ సమర్థించదగ్గ విషయం కాదని అంటున్నారు. తమ పార్టీ నాయకుడే అయినప్పటికీ.. ఆ పని ఎవరు చేసినా తప్పు తప్పేనని చెబుతున్నారు. దీనిపై మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య తన గళాన్ని వినిపించారు. బుధవారం ఓ న్యూస్ ఛానల్ తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు.
రాష్ట్రానికి మరో వరం?: అనూహ్యంగా తెరపై వాల్తేర్ డివిజన్: ఏపీ సెంటిమెంట్ ను గౌరవిస్తామన్న కేంద్రం!
హైదరాబాద్ లో కొనసాగిన రాష్ట్ర అసెంబ్లీని.. రాజధాని అమరావతి ప్రాంతంలోని వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక అసెంబ్లీ భవనానికి తరలించే సమయంలో ఫర్నిచర్, కంప్యూటర్ల వంటి ఇతర సామాగ్రిని కోడెల శివప్రసాద్ రావు తన సొంత అవసరాల కోసం వినియోగించుకున్నారనే విషయం తెలిసిందే. ఈ విషయాన్ని కోడెల స్వయంగా అంగీకరించారు. తన ఛాంబర్ లోని విలువైన ఫర్నిచర్, కంప్యూటర్ల వంటివి పాడై పోతాయనే ఉద్దేశంతో.. వాటిని సత్తెనపల్లి, గుంటూరుల్లోని తన క్యాంపు కార్యాలయానికి తరలించానని ఆయన వెల్లడించారు. దీనిపై వర్ల రామయ్య.. తన సహచరుడు కోడెల శివప్రసాద్ రావుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
అసెంబ్లీ ఫర్నిచర్ ను ఎలా తీసుకెళ్లగలరని నిలదీశారు. కోడెల తన స్నేహితుడేనని, తాను గురువుగా భావిస్తానని అయినప్పటికీ.. ఆయన చేసిన పని తప్పేనని అన్నారు. ప్రజల సొమ్ముతో కొనుగోలు చేసిన ఫర్నిచర్ గానీ, కంప్యూటర్లు గానీ, ఇతర విలువైన వస్తువులను తన వ్యక్తిగత అవసరాల కోసం వినియోగించుకోవడం సరి కాదని చెప్పారు. తాను పార్టీ ప్రధాన కార్యదర్శిగా కాకుండా..వ్యక్తిగతంగా మాత్రమే ఈ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారని వర్ల రామయ్య చెప్పుకొచ్చారు. అసెంబ్లీ ఫర్నిచర్ ను తీసుకెళ్లి, ఇంట్లో ఎలా పెట్టుకుంటారని ప్రశ్నించారు. ఇప్పుడొచ్చి.. వాటిని తీసుకెళ్లండని అనడంలో అర్థమేంటని అన్నారు.
కోడెల అలా చేయకుండా ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఆ ఫర్నిచర్ ను తీసుకెళ్లలేదని, అందుకే తాను వాటిని ఇంట్లోనే ఉంచుకున్నానని అనడం కూడా సరి కాదని చెప్పారు వర్ల రామయ్య. అసలు ఆయన ఫర్నిచర్ ను తీసుకెళ్లడమే తప్ప అని అన్నారు. ఆ ఫర్నిచర్ ను తీసుకెళ్లమని అసెంబ్లీ కార్యదర్శి ఏమైనా అధికారికంగా చెప్పారా? అని ప్రశ్నించారు. కోడెల ఇంట్లో ఉన్న అసెంబ్లీకి చెందిన ప్రతి సామాగ్రిని సిబ్బంది వెనక్కి తీసుకెళ్తారని, ఏవైనా రికవరీ కాకపోతే.. దాని విలువను ఆయన చెల్లించాల్సి ఉంటుందని వర్ల రామయ్య అన్నారు. కోడెల చర్యల వల్ల పార్టీ ప్రతిష్ఠ ఒకింత దెబ్బ తిన్నదని స్పష్టం చేశారు. పార్టీ ప్రతిష్ఠ దెబ్బతిన్నదనే విషయాన్ని తాను కూడా చెప్పకపోతే.. పార్టీలో ఇంకెవరూ మాట్లాడరని అన్నారు.