జగన్ను ట్రంప్తో పోల్చిన యనమల- స్ధానిక ఎన్నికలపై వైసీపీ వాదన విడ్డూరమంటూ...
ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణపై టీడీపీ, వైసీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కరోనా పేరుతో గతంలో ఎన్నికలు వాయిదా వేసిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మళ్లీ కరోనా తగ్గకముందే ఎన్నికలు నిర్వహించడం సరికాదని వైసీపీ ప్రభుత్వం అభ్యంతరాలు చెబుతుంటే నిమ్మగడ్డకు మద్దతుగా ఎన్నికలు నిర్వహించాల్సిందేనని టీడీపీ పట్టుబడుతోంది.
ఏపీలో స్ధానిక ఎన్నికల నిర్వహణ విషయంలో వైసీపీ సర్కారు అవలంబిస్తున్న వైఖరిని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తీవ్రంగా తప్పుబట్టారు. ఈ విషయంలో సీఎం జగన్ను ఆయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పోల్చారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత కూడా రాజ్యాంగాన్ని ధిక్కరిస్తూ ట్రంప్ ఎలా వ్యవహరిస్తున్నారో, ఇక్కడ ఏపీలోనూ రాజ్యాంగానికి వ్యతిరేకంగా జగన్ అలాగే వ్య.వహరిస్తున్నారని యనమల ఆరోపించారు. జగన్ శైలి అచ్చు ట్రంప్లాగే ఉందన్నారు.

స్ధానిక ఎన్నికల విషయంలో వైసీపీ ప్రభుత్వ వాదన విడ్డూరంగా ఉందని యనమల అన్నారు. ఇలాంటి సీఎంనూ, వింత పార్టీని, వితండ ప్రభుత్వాన్ని తాను ఎక్కడా చూడలేదన్నారు. ఎస్ఈసీని రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించమంటే వారు చెప్పిందే వినాలని కాదని రాజ్యాంగ సంస్ధ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవచ్చని యనమల పేర్కొన్నారు. స్వయం ప్రతిపత్తితో ఎన్నికల సంఘాన్ని పనిచేయ నీయడం లేదన్నారు. జగన్ సర్కారు పాలనలో రాష్ట్రంలో నెపోటిజం, ఫేవరిజం తప్ప మరేమీ లేదన్నారు. ఏ అధికారంలో సీఎస్ ఎన్నికల కమిషన్ను ధిక్కరిస్తున్నారని యనమల ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications