విశాఖ ఉక్కు ఆందోళనలో టీడీపీ , వైసీపీ నేతల బాహాబాహీ .. కైకలూరులో ఉద్రిక్తత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. బీజేపీ మినహాయించి అన్ని పార్టీలు బంద్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి పిలుపునిచ్చిన బంద్ నేపథ్యంలో అన్ని పార్టీలు ఆందోళనలకు శ్రీకారం చుట్టాయి. ఈ క్రమంలో కృష్ణా జిల్లాలో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
ఉక్కు ఆందోళన సందర్భంగా కృష్ణా జిల్లా కైకలూరు లో వైసీపీ టీడీపీ శ్రేణులు బాహాబాహీకి దిగారు.
కైకలూరులో జరిగిన బంద్ లో టీడీపీ , వైసీపీ వర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది. అఖిలపక్ష ఆందోళనలో ఒకే పార్టీ ఫ్లెక్సీ ఏర్పాటుపై రెండు పార్టీల మధ్య చోటుచేసుకున్న వాగ్వాదం ఘర్షణలకు దారితీసింది టిడిపి నేత జయమంగళ వెంకట రమణ ఫ్లెక్సీని తీసుకుని రావటంతో వైసీపీ శ్రేణులు ఆగ్రహానికి గురయ్యారు . జయమంగళ వెంకటరమణ చేతిలో ఉన్న ఫ్లెక్సీని వైసిపి కార్యకర్తలు చించేశారు. మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణపై వైసీపీ వర్గీయులు దాడికి ప్రయత్నించగా అక్కడే ఉన్న టిడిపి కార్యకర్తలు అడ్డుకున్నారు.

దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇరువర్గాలను అదుపు చేశారని
పోలీసు వర్గాలు తెలిపాయి. తమపై వైసీపీ శ్రేణులు దాడికి యత్నించటంతో ఆగ్రహం వ్యక్తం చేసిన జయమంగళ వెంకటరమణ ,టిడిపి కార్యకర్తలతో కలిసి జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. వైసిపి వర్గీయులు తమకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక ఈ ఘటనలతో కైకలూరు లో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications