జాబ్ క్యాలెండర్ పై విజయవాడలో కదం తొక్కిన నిరుద్యోగులు .. అరెస్ట్ చేసిన పోలీసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగుల ఆందోళన బాట పట్టారు. వైసీపీ సర్కార్ ఇటీవల విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపింది. ఇక ఈ జాబ్ క్యాలెండర్ ను వ్యతిరేకిస్తూ నిరుద్యోగులు విద్యార్థులు కదం తొక్కుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ సంఘాలు విజయవాడలో ఆందోళన చేపట్టాయి.
ఆందోళన చేస్తున్న నిరుద్యోగులను పోలీసులు అరెస్ట్ చేసి ఆయా ప్రాంతాల్లో ఉన్న పోలీస్ స్టేషన్లకు తరలించారు. నూతన జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని, చదువు పూర్తయినా ఉద్యోగాల్లేక, ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని నిరుద్యోగులు ఆందోళన చేశారు. విజయవాడ శివారు ఇబ్రహీంపట్నంలో ఎస్ ఎఫ్ ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన సాగించిన నిరుద్యోగులు వయోపరిమితి 47 సంవత్సరాలకు పెంచాలని కూడా డిమాండ్ చేశారు.
నూతన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని ఆందోళన చేస్తున్న నిరుద్యోగులను పోలీసులు అరెస్ట్ చేసి సమీపంలోని పోలీస్ స్టేషన్ కు తరలించారు. రాష్ట్రవ్యాప్తంగా నిత్యం ఎక్కడో ఒక చోట ఇటీవల వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ కి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీలు కూడా నిరుద్యోగుల వైపు నిలబడి ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే ఉన్నాయి. ఇక తమకు అండగా ప్రభుత్వంపై పోరాటం చెయ్యాలని ఇటీవల నిరుద్యోగులు జనసేనాని పవన్ కళ్యాణ్ ను కలిశారు. మరోవైపు నిరుద్యోగుల కోసం టీడీపీ నేత లోకేష్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు.