విజయవాడలో తగ్గని మున్సిపల్ ఎన్నికల కాక .. జోరుగా బెట్టింగ్ లు, మరోమారు బోండా ఉమా సవాల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా వాతావరణం వేడిగానే ఉంది. విజయవాడలో ఎన్నికల రాజకీయాలు సవాళ్లు ప్రతిసవాళ్లతో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత కూడా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇదే సమయంలో జోరుగా ఎన్నికల విషయంలో బెట్టింగ్ లు కూడా కొనసాగుతున్నాయి.
విజయవాడ కార్పొరేషన్ లో వైసీపీ మొత్తం డివిజన్లను గెలుచుకుంటే ఆ పని చేస్తానన్న బోండా ఉమ
తాజాగా విజయవాడ టిడిపి నాయకుడు బోండా ఉమ మరోమారు అధికార వైసీపీ నేతలకు సవాల్ చేశారు. విజయవాడ కార్పొరేషన్ లో వైసీపీ మొత్తం డివిజన్లను గెలుచుకుంటే, రాజకీయాల నుంచి తప్పుకుంటానని టిడిపి నేత బోండా ఉమా సంచలన సవాల్ విసిరారు. అంతేకాదు కట్టుబట్టలతో విజయవాడ నుంచి వెళ్లిపోతానని ఆయన పేర్కొన్నారు. ఎన్నికలు ముగిసిన తరువాత వైసిపి నేత , ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎన్నికల ఫలితాలపై చేసిన కామెంట్లకు కౌంటర్ గా టిడిపి నాయకుడు బోండా ఉమ సవాల్ విసిరారు.
సజ్జల వ్యాఖ్యలకు కౌంటర్ గా బోండా ఉమ సవాల్
వైసిపి నేత సజ్జల రామకృష్ణారెడ్డి విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలలో వంద శాతం విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు తాము ఈ ఎన్నికల్లో హిస్టరీని క్రియేట్ చేస్తున్నామంటూ వ్యాఖ్యానించారు. ఏపీలో వందకు వంద శాతం మున్సిపాలిటీలు వైసిపి కైవశం చేసుకుంటుందని, టిడిపి సింగిల్ డిజిట్ కే పరిమితమవుతుందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో బోండా ఉమా మరోమారు సంచలన సవాల్ చేశారు.
ఏపీలో ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ లు .. విజయవాడ మేయర్ పై బెట్టింగ్ ల జోరు
ఇక విజయవాడలో కార్పొరేషన్ ఎన్నికల పోరు కొనసాగింది . పోలింగ్ కూడా అనేక ఘర్షణల మధ్య ముగిసింది . మరో 48 గంటల్లో ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఏపీలో జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి. ముఖ్యంగా విజయవాడ మేయర్ గా ఎవరు కార్పొరేషన్లో బాగా వేస్తారు అన్నదానిపై బెట్టింగ్లు కొనసాగుతున్నట్లు గా తెలుస్తుంది. విజయవాడ కార్పొరేషన్లో మొత్తం 64 డివిజన్లలో ఏ పార్టీకి ఎన్ని డివిజన్లు దక్కుతాయి అన్నది ఆసక్తిని రేకెత్తిస్తుంది . మొత్తానికి ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత కూడా విజయవాడ కార్పొరేషన్ లో రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి.