AP Rains: ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డు మూసివేత- భారీ వర్షాల ప్రభావంతో
ఏపీలో రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో కుండపోత వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. ప్రాజెక్టులు నిండుకుండలా మారుతున్నాయి. విజయవాడ జిల్లాలోనూ వర్షాల ప్రభావం అధికంగానే ఉంది. దీంతో అధికారులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.
విజయవాడలోని దుర్గగుడి ఘాట్ రోడ్డును అధికారులు మూసివేశారు. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండపైకి వాహనాలకు అనుమతి నిరాకరిస్తున్నారు. ఘాట్ రోడ్డులోని కొండ ప్రాంతంలో చిన్న చిన్న కొండరాళ్లు పడుతున్నాయి. దీంతో మహామండపం ద్వారానే భక్తులు అమ్మవారిని దర్శించుకోవాలని దుర్గగుడి ఈవో భ్రమరాంబ ఆదేశాలు జారీ చేశారు.
గత మూడు రోజులుగా వర్షం పడుతున్న దృష్ట్యా ఘాట్ రోడ్డుపై వాహనాల రాకపోకలను నిలిపివేశామని దుర్గగుడి ఈవో భ్రమరాంబ తెలిపారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా దేవస్థానం బస్సులను మాత్రమే అనుమతిస్తున్నట్లు చెప్పారు. మిగిలిన వాహనాలను మహామండపం ద్వారానే అనుమతిస్తున్నామన్నారు. శాకాంబరీ ఉత్సవాల దృష్ట్యా పదుల సంఖ్యలో వచ్చే వాహనాలను మహామండపం ద్వారానే అనుమతిస్తామని ఆమె తెలిపారు. వాతావరణం అనుకూలించాకే వాహనాలను కొండపైకి అనుమతించనున్నట్లు దుర్గగుడి ఈవో ప్రకటించారు.
గతంలో ఇంద్రకీలాద్రికి వెళ్లే మార్గంలో ఘాట్ రోడ్డుపై కొండచరియలు విరిగిపడిన ఘటనలు చాలా జరిగాయి. అయితే కొన్నేళ్లుగా అక్కడ చేసిన రక్షణ ఏర్పాట్ల కారణంగా ప్రమాదాల సంఖ్య బాగా తగ్గింది. అయినా ఇప్పటికీ చిన్న రాళ్లు పడుతూనే ఉన్నాయి. దీంతో ఘాట్ రోడ్డుపై వెళ్లే వాహనాలపై ఇవి పడితే ప్రమాదాలు తప్పవని భావించిన అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.