బెజవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనాలు నిలిపివేత .. నిత్య పూజలు యధాతధం
ఏపీలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా వైరస్ విజృంభిస్తున్నందున దుర్గ గుడిలో మార్చి 31 వరకు అన్ని సేవలు నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులను రావొద్దని చెప్తున్నారు. ఇంద్రకీలాద్రి పైకి ఎవరూ రాకుండా ఘాట్ రోడ్ ను మూసివేశారు . కరోనా జన సమూహం ఎక్కువగా ఉండే చోట వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో ఇప్పటికే ఏపీలోని ప్రముఖ ఆలయాలలోకి భక్తుల ప్రవేశాన్ని నిషేధించారు .

కనకదుర్గ అమ్మవారి ఆలయంలో భక్తుల దర్శనాలు రద్దు
కరోనా మహమ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో భక్తులు నిర్వహించే అన్ని ఆర్జిత సేవలను నిలిపేసినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. కేశ ఖండనశాలను, అమ్మవారి గుడి దగ్గరకు వెళ్లే బస్సులను, అలాగే లిఫ్టులను కూడా నిలిపివేశామని తెలిపారు. అమ్మవారి అంతరాలయ దర్శనాలను రద్దు చేశామన్నారు. ఇప్పటి వరకు దర్శనానికి వచ్చే భక్తులకు శానిటైజేషన్ లిక్విడ్ అందజేసిన ఆలయ సిబ్బంది ఈ ప్రక్రియ భక్తుల రద్దీ నేపధ్యంలో ఇబ్బందికరంగా మారటంతో భక్తులకు దర్శనాలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు .

ఉగాది పంచాంగ శ్రవణం లైవ్ లో చూపిస్తామని చెప్పిన ఆలయ అధికారులు
నిన్నా మొన్నటి దాకా భక్తులందరికీ వైద్యపరీక్షలు చేసిన తర్వాతే దర్శనానికి అనుమతించిన ఆలయ అధికారులు దేశ ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని హోమాలు జరిపించారు . దుర్గాగుడి ఆలయ ఈవో సురేష్ బాబు మాట్లాడుతూ భక్తుల ఆరోగ్య రక్షణ దృష్ట్యా దర్శనాలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఉగాది రోజు పంచాగశ్రవణం ఉంటుందని,అది లైవ్ లో చూపిస్తామని కానీ అమ్మవారి సేవలకు భక్తులకు అనుమతి లేదని పేర్కొన్నారు .
Recommended Video

అమ్మవారి నిత్య పూజలు యధాతధం .. భక్తులకు మాత్రమే నో పర్మిషన్
అమ్మవారికి సుప్రభాత సేవ నుండి రాత్రి జరిగే ఏకాంత సేవ వరకు అన్ని సేవలు యధావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. భక్తులు ఎవరైనా ముందుగా సేవలను బుక్ చేసుకుని ఉంటే వారిపేరున సేవలు నిర్వహిస్తామన్నారు. కానీ వారు ఆలయానికి రావటానికి వీలు లేదని చెప్పారు. ఒకవేళ డబ్బు తిరిగి కావాలనుకుంటే చెల్లిస్తామన్నారు. ఇక ఆలయ పరిసరాలను ప్రతి రెండు గంటలకు ఒకసారి శుభ్రపరుస్తున్నామని తెలిపారు. కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు కనకదుర్గ ఆలయ అధికారులు .












Click it and Unblock the Notifications