విజయవాడలో లాయర్ల నిరసనలు-మార్గదర్శికి మద్దతుపై సీఐడీ నోటీసులకు వ్యతిరేకంగా..
ఏపీలో మార్గదర్శి చిట్స్ అక్రమాల వ్యవహారం ఇప్పుడు లాయర్లకూ, సీఐడీకి మధ్య చిచ్చుకు కారణమవుతోంది. మార్గదర్శి చిట్స్ పై ఏపీ ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ లాయర్లు తాజాగా సంస్ధకు మద్దతు ప్రకటిస్తున్నారు. దీంతో ఇలా మద్దతు ప్రకటించిన లాయర్లపై కేసులు నమోదు చేసి విచారణకు రావాలని సీఐడీ నోటీసులు జారీ చేస్తోంది. దీనిపై లాయర్లు మండిపడుతున్నారు. సీఐడీ తీరును నిరసిస్తూ ఇవాళ విజయవాడతో పాటు కృష్ణాజిల్లాలోని పలు కోర్టుల్లో లాయర్లు విధులు బహిష్కరించారు.
ఏపీలో మార్గదర్శి కేసు దర్యాప్తు చేస్తున్న సీఐడీ అధికారులు తాజాగా వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి అక్రమాల వివరాలను వెల్లడిస్తున్నారు. దీనిపై మార్గదర్శి అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. అలాగే మార్గదర్శికి చెందిన ఈనాడు పత్రికలోనూ ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ కథనాలు వస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో ఏపీ ప్రొఫెషనల్స్ ఫోరం సదస్సులు ఏర్పాటు చేసి సీఐడీ చర్యల్ని ఖండిస్తోంది. ఇందులో భాగంగా లాయర్లు కూడా వాటిలో పాల్గొని సీఐడీ చర్యల్ని తప్పుబడుతున్నారు. ఇప్పుడు ఇదే వివాదానికి కారణమవుతోంది.

మార్గదర్శికి మద్దతుగా వ్యాఖ్యలు చేస్తున్న లాయర్లకు సీఐడీ నోటీసులు జారీ చేసి విచారణకు రావాలని పిలిపిస్తోంది. దీంతో సీఐడీ తీరుపై లాయర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా లాయర్లకు సీఆర్పీసీ 160 ప్రకారం సీఐడీ నోటీసులు జారీ చేయడాన్ని తప్పుబడుతూ లాయర్లు నిరసనలకు దిగుతున్నారు. ఇవాళ విజయవాడలో బెజవాడ బార్ అసోసియేషన్ సీఐడీ చర్యల్ని ఖండించింది. సీఐడీ చర్యలపై లాయర్లు విధులు బహిష్కరించి నిరసనలు చేపట్టారు.
విజయవాడతో పాటు ఉమ్మడి కృష్ణాజిల్లాలోని నూజివీడు, బందరులోనూ న్యాయవాదులు కోర్టుల్లో విధులు బహిష్కరించి ఆందోళనలకు దిగినట్లు తెలుస్తోంది. సీఐడీ నోటీసులను నిరసిస్తూ హైకోర్టులోనూ నిరసనలు తెలిపేందుకు వారు సిద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలో సీఐడీ నోటీసుల వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.












Click it and Unblock the Notifications