ఇంతకీ పట్టాభి ఎక్కడ.. ఇంకా ఇంటికి చేరని నేత.. మరోసారి అరెస్ట్ అని..?
టీడీపీ నేత పట్టాభిరామ్ ఎక్కడ ఉన్నారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో నిన్న సాయంత్రం రాజమండ్రి జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. ఆయన విజయవాడ వెళ్లే క్రమంలో పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారనే ప్రచారం జరుగుతోంది. నిన్న విడుదలైన పట్టాభి ఇంతవరకూ ఇంటికి రాకపోవడంతో.. పోలీసులే అరెస్ట్ చేశారనే వాదనలకు బలం చేకూరుతుంది. తాను ఉన్న వాహనంతోపాటు మరో రెండు వాహనాల్లో నిన్న సాయంత్రం 6 గంటలకు రాజమండ్రి జైలు నుంచి పట్టాభి విజయవాడకు బయల్దేరారు.
రెండు వాహనాలకే అనుమతి
పొట్టిపాడు టోల్ గేట్ వద్దకు చేరుకోగానే పోలీసులు భారీగా మోహరించారు. పట్టాభిరామ్ కారుతో పాటు మరో రెండు వాహనాలనే అనుమతించారు. మిగతా వాహనాలను అక్కడే ఆపేశారు. దీంతో పట్టాభిని మరోసారి అరెస్ట్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. విజయనగరం జిల్లాలో నమోదైన కేసులో పట్టాభిని ఇంకోసారి అరెస్ట్ చేశారని ప్రచారం జరుగుతోంది. తనను పోలీసులు మరోసారి అరెస్ట్ చేసే అవకాశం ఉందని అంతకుముందే టీడీపీ నేతల వద్ద పట్టాభి ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ప్రచారాన్ని పోలీసులు ఖండించారు.
అరెస్ట్ చేయలే
పట్టాభిని అరెస్ట్ చేయలేదని స్పష్టం చేశారు. తనంతట తానే వెళ్లిపోయారని, తమకేం సంబంధం లేదని చెప్పారు. పట్టాభి సురక్షిత ప్రాంతంలోనే ఉన్నారని టీడీపీ నేతలకు సమాచారం అందినట్టు తెలుస్తోంది. ఏపీ సీఎం జగన్పై చేసిన కామెంట్లతో పట్టాభిపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పట్టాభి ఇంటిపై, టీడీపీ ఆఫీసులపై వైసీపీ కార్యకర్తలు దాడులు చేశారు. పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాజమండ్రి జైలులో ఉన్న ఆయన హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. దీంతో ఆయనకు హైకోర్టు నిన్న బెయిల్ మంజూరు చేసింది.
తిట్ల దండకం
సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సీఎం జగన్ను పట్టాభిరామ్ బోసడీకే అని దూషించారంటూ విజయవాడ వ్యాపారి షేక్ మస్తాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పట్టాభిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. పట్టాభి హైకోర్టులో బెయిల్కు దరఖాస్తు చేసుకోగా, న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. పట్టాభి కామెంట్లతో ఏపీలో దుమారం చెలరేగింది. టీడీపీ శ్రేణుల ఆందోళనలు.. వైసీపీ కార్యకర్తల నిలువరింపులు జరిగాయి. చంద్రబాబు 36 గంటల దీక్ష కూడా చేశారు. సోమవారం ఢిల్లీ వెళ్లి.. కేంద్ర ప్రభుత్వ పెద్దలను, రాష్ట్రపతిని కలువనున్నారు.