దాడులపై ఎస్సీ ఎస్టీ కమీషన్ కు ఫిర్యాదు చేయనున్నారా ? చంద్రబాబు సంకేతాలిచ్చారా ?
టీడీపీ కార్యకర్తలు, మద్దతుదారులపై జరుగుతున్న దాడులను అడ్డుకోవాలని, కార్యకర్తలకు అండగా నిలవాలని టీడీపీ అధినాయకత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని వైసీపీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో దాడులకు దిగుతున్న అంశాన్ని సీరియస్ గా తీసుకుని దాడులకు చెక్ పెట్టే వ్యూహంలో ఉన్నారు చంద్రబాబు . అందులో భాగంగా టీడీపీ నేతలకు పలు సంకేతాలిస్తున్నారు. కేసులు పెట్టి పోరాటం చెయ్యటంతో పాటు ఎస్సీ, ఎస్టీ లైతే ఎస్సీ, ఎస్టీ కమీషన్లో సైతం ఫిర్యాదులు చెయ్యాలని సూచించారు.

ఏపీలో టెన్షన్ పుట్టిస్తున్న దాడులు .. చంద్రబాబు పార్టీ నేతలకు దిశా నిర్దేశం
ఏపీలో దాడులు టెన్షన్ పుట్టిస్తున్నాయి. ఇటీవల ఏపీలో జరుగుతున్న దాడులలో పలువురు కార్యకర్తలు ప్రాణాలు కోల్పోవటం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. శాంతి భద్రతలను కాపాడాల్సిన వైసీపీ ప్రభుత్వం దీని గురించి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నేతలు . ఇటీవల పర్చూరు నియోజకవర్గంలో, మంగళగిరి నియోజకవర్గంలో ఇద్దరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హత్యకు గురికాబడ్డారు. 40 రోజుల్లో ఆరుగురు తెదేపా కార్యకర్తలను హత్యకు గురవ్వటం కిరాతకమని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. తెదేపా సీనియర్ నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు కార్యకర్తలపై జరుగుతున్న దాడులను అడ్డుకోవాలని చెప్పి కార్యకర్తల రక్షణ, వారి ఆస్తుల భద్రత మనందరి బాధ్యత అని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.

ఎస్సీ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేయాలని నేతలకు , కార్యకర్తలకు సూచించిన చంద్రబాబు
ఇక ఎస్సీలు, ఎస్టీలు అయిన టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తే ఎస్సీ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేయాలని కార్యకర్తలకు చంద్రబాబు సూచించారు. తమ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే దాడులు, దౌర్జన్యాలతో వైసీపీ నేతలు రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.చంద్రబాబు ఇచ్చిన సంకేతాలతో టీడీపీ నేతలు ఇప్పటివరకు జరిగిన దాడుల్లో ఎస్సీలు ఎందరు ఉన్నారో వారందరికీ సంబంధించి ఎస్సీ ఎస్టీ కమీషన్ కు ఫిర్యాదు చేయనున్నారని సమాచారం .

రాజకీయ కక్షలతో అట్టుడుకుతున్న రాష్ట్రం .. రోజుకో చోట దాడి
రోజురోజుకీ ఏపీలో రాజకీయ కక్షల నేపధ్యంలో దాడులు పెరుగుతుండటంతో ఆందోళనకర వాతావరణం నెలకొంది. వైసీపీ ప్రభుత్వం దాడులను ఆపటానికి ఎలాంటి ప్రయత్నమూ చేయటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాడులు జరిగాక కేసులు పెట్టుకోండి అని హోం మంత్రి చెప్పటం, దాడులు జరిగే ప్రతి చోట కాపలా పెట్టలేమని చెప్పటం కూడా టీడీపీ ఆందోళనకు కారణంగా మారింది. చంద్రబాబు దాడులపై మండిపడుతున్నా, తెలుగు తమ్ముళ్ళకు నేనున్నా అంటూ భరోసా ఇచ్చినా సరే రోజుకో చోట దాడులు జరగటం సర్వ సాధారణం అయిపోయింది.












Click it and Unblock the Notifications