తిరుపతిలో జగన్ బహిరంగసభ రద్దు- రాలేకపోతున్నానంటూ లేఖ- కారణమిదేనంటూ
ఈ నెల 17న జరిగే తిరుపతి ఉపఎన్నిక కోసం జరుగుతున్న ప్రచారంలో పాల్గొనేందుకు సిద్దమైన సీఎం జగన్ చివరి నిమిషంలో తన పర్యటన రద్దు చేసుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా వ్యాప్తితో పాటు మరణాలు కూడా పెరుగుతున్న నేపథ్యంలో తన బహిరంగసభను వాయిదా వేసుకుంటున్నట్లు సీఎం జగన్ తెలిపారు. ఈ మేరకు తిరుపతి ఓటర్లకు ఓ లేఖ రాశారు. ఇందులో వైసీపీ అభ్యర్ధి గురుమూర్తిని గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్దించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి వైసీపీ అభ్యర్దికి ఓటేయాలని కోరారు.
తిరుపతి సభ రద్దు చేసుకున్న జగన్
తిరుపతి ఉపఎన్నిక ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. అధికార వైసీపీతో పాటు టీడీపీ, బీజేపీ అభ్యర్దులు ముమ్మరంగా ప్రచారం సాగిస్తన్నారు. ఇదే సమయంలో వైసీపీ అభ్యర్ది గెలుపు కోసం మంత్రులు, ఎమ్మెల్యేలకు భారీ టార్గెట్ పెట్టిన సీఎం జగన్ దీన్ని అందుకునేందుకు వారికి దిశానిర్దేశం కూడా చేశారు. అయితే అనుకున్న స్ధాయిలో మెజారిటీ వస్తుందో లేదో అన్న అనుమానాలతో తానే నేరుగా బరిలోకి దిగాలని జగన్ నిర్ణయించారు. అయితే చివరి నిమిషంలో ఆయన తిరుపతి పర్యటన రద్దు చేసుకున్నారు.
తిరుపతి ఓటర్లకు జగన్ మరో లేఖ
తిరుపతి బహిరంగసభను రద్దు చేసుకున్న సీఎం జగన్ ఈ మేరకు స్దానిక ఓటర్లకు మరో లేఖ రాశారు. తాజాగా తిరుపతికి వెళ్లకముందే ఓటర్లను ఆకట్టుకునేందుకు ఓ లేఖ రాసిన జగన్.. ఇవాళ మరో లేఖ రాశారు. ఇందులో వైసీపీ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ఏకరువు పెట్టారు. తిరుపతిలో వైసీపీ అభ్యర్దిని గెలిపించాల్సిన అవసరాన్ని ఓటర్లకు గుర్తు చేసారు. అదే సమయంలో తాను ఈ సభకు ఎందుకు రాలేకపోతున్నానో కూడా ఓటర్లకు జగన్ వివరించారు.
తిరుపతికి ఎందుకు రావట్లేదంటే
తిరుపతి బహిరంగసభను తాను రద్దు చేసుకోవడం వెనుక గల కారణాలను తన లేఖలో సీఎం జగన్ ఓటర్లకు వివరించారు. ఇందులో ఆయన ప్రస్తుతం రాష్ట్రంలో కోవిడ్ పరిస్దితులు, దీని వల్ల గత 24 గంటల్లో 11 మంది మృత్యువాత పడటాన్ని ఓటర్లకు గుర్తు చేశారు. ఇప్పుడు తాను బహిరంగసభ నిర్వహించే మీరంతా తరలివస్తారని, ఇది మీ కుటుంబాలకు, ఆరోగ్యాలకు ఇబ్బంది ఎదురవుతుందని, అందుకే బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా, బాధ్యత గల స్దానంలో ఉన్న అన్నగా, తమ్ముడిగా తిరుపతిలో బహిరంగసభ రద్దు చేసుకుంటున్నట్లు సీఎం జగన్ తెలిపారు.
Recommended Video
తిరుగులేని మెజారిటీ ఇవ్వాలని వినతి
రెండేళ్లుగా ప్రజల కోసం వైసీపీ సర్కారు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, వీటికి సంబంధించిన వివరాలను ఇప్పటికే ఓ లేఖ రూపంలో మీ అందరికీ పంపానని జగన్ గుర్తు చేసారు. మంచి చేస్తున్న ప్రభుత్వానికి నిండు మనసుతో, గుండెనిండా ప్రేమతో మీ అందరి చల్లని దీవెనలను ఓటు రూపంలో ఇస్తారని ఆశిస్తున్నట్లు సీఎం తెలిపారు. గతంలో బల్లి దుర్గాప్రసాద్కు ఇచ్చిన మెజారిటీ కంటే మంచి మెజారిటీని గురుమూర్తికి అందించి ఘనవిజయం కట్టబెట్టాలని ఓటర్లను కోరారు.