విశాఖలో 15 వేల కోట్ల భూ దోపిడి: జగన్ సంగతేంటి.. ధూళిపాళ్ల నరేంద్ర
విశాఖ, అమరావతి రాజధాని పేరుతో ఏపీలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్దం జరుగుతోంది. విశాఖలో రాజధాని పేరుతో భూ దోపిడి జరిగిందని ప్రతిపక్ష టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనికి అధికార వైసీపీ నుంచి అదేస్థాయిలో స్పందిస్తోంది. విశాఖలో 15 వేల కోట్ల భూ దోపిడి జరిగిందని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆరోపించారు. అమరావతిలో కూడా మోసం చేశారని దుయ్యబట్టారు. జగన్ సర్కార్పై నరేంద్ర ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు.
అమాయకులను మోసగించి..
అమరావతి అసైన్డ్ భూముల అక్రమాలకు ఆధారాలు లేకుండా అమాయకులను మోసగించారని నరేంద్ర ఆరోపించారు. దొంగతనంగా వైసీపీ ఎమ్మెల్యేలు సంతకాలు చేయించారని మండిపడ్డారు. అసైన్డ్ భూముల విషయంలో అన్నివర్గాలకు సమాన ప్రాతిపదికన అమరావతిలో ప్లాట్లు కేటాయించారని వివరించారు. మాజీ సీఎం చంద్రబాబు పారదర్శకంగా వ్యవహరించడం వల్లే కేసు నీరుగారిపోయిందని వివరించారు.
జీవో 72 అడ్డుపెట్టుకుని
జీవో 72ను అడ్డుపెట్టుకుని విశాఖలో 6 వేల ఎకరాలకు పైగా స్వాధీనం చేసుకున్నారని నరేంద్ర ఆరోపించారు. అందులో 2552 ఎకరాలు దళితుల స్వాధీనంలో గల అసైన్డ్ భూములు అని చెప్పారు. ఆ భూములను ప్రభుత్వం ఎవరికీ అప్పగించిందో వైసీపీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలియజేయాలని కోరారు. కొందరికీ భూములను కట్టబెట్టేందుకు జీవో 72 ద్వారా రూ.15 వేల కోట్ల మేర లావాదేవీలు జరిగాయని ఆరోపించారు.
ఎన్ని వేల రిజిస్ట్రేషన్లు జరిగాయి..
విశాఖను రాజధాని ప్రాంతంగా ప్రకటించిన తర్వాత ఎన్ని వేల వరకు రిజిస్ట్రేషన్లు జరిగాయని నరేంద్ర ప్రశ్నించారు. భూములు కొన్నవారు ఎవరు.. ఎన్ని వేల ఎకరాలు కొనుగోలు చేశారని ప్రశ్నించారు. దీనికి సంబంధించి ఎవరు డబ్బులు ఇచ్చారనే వివరాలను ప్రజల ముందు బహిరంగపరచే ధైర్యం ప్రభుత్వానికి ఉందా అని అడిగారు. విశాఖపట్టణం కేంద్రంగా జరిగిన భూముల అక్రమాలపై విచారణకు ఆదేశించే సత్తా వైసీపీ ప్రభుత్వానికి ఉందా అని సవాల్ విసిరారు.
మరీ జగన్ సంగతేంటి
చంద్రబాబు నాయుడు స్టే తీసుకున్నారని అక్కసుతో నేతలు మాట్లాడుతున్నారని నరేంద్ర అన్నారు. మరీ అవినీతి కేసుల విచారణకు జగన్ ఎందుకు హాజరు కావడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటికైనా చిలుక పలుకులు మానుకుంటే మంచిదని హితవు పలికారు.