విశాఖ సెంట్రల్ జైల్లో కరోనా కల్లోలం- 27 మందికి ఖైదీలు, 10 మంది సిబ్బందికీ..
విశాఖ కేంద్ర కారాగారంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. కరోనా వైరస్ సోకడంతో ఇప్పటికే పలువురు ఖైదీలు ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇదే సమయంలో జైల్లో శిక్ష అనుభవిస్తున్న మొద్దు శ్రీను హంతకుడు ఓం ప్రకాశ్ చనిపోయాడు. కరోనా పరీక్ష నిర్వహిస్తే వైరస్ సోకినట్లు తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు జైల్లో మిగిలిన ఖైదీలతో పాటు సిబ్బందికీ పరీక్షలు నిర్వహించారు. ఇందులో పలువురు వైరస్ బారిన పడినట్లు నిర్ధారణ అయింది.
విశాఖ కేంద్ర కారాగారంలో ఇప్పటివరకూ 27 మంది ఖైదీలు, 10 మంది సిబ్బంది కరోనా బారిన పడినట్లు నిర్ధారణ అయింది. తాజాగా అధికారులు నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఈ విషయం తేలింది. ఇందులో తీవ్రతను బట్టి బాధితులను క్వారంటైన్ సెంటర్లకు పంపుతున్నారు. పలువురికి అక్కడే ఉంచి హోం క్వారంటైన్ సదుపాయాలు కల్పిస్తున్నారు. కరోనా సోకిన ఉద్యోగులకు సెలవులు ఇచ్చి హోం క్వారంటైన్ లో ఉండేలా ఆదేశాలు ఇస్తున్నారు. జైల్లో మిగిలిన వారికి కూడా త్వరలో కోవిడ్ పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.