జులై 23న విశాఖకు రాజధాని తరలింపుపై మరో క్లారిటీ: ఆ భూములు పేదలకు: మంత్రి అవంతి
విశాఖపట్నం: సాగరనగరం విశాఖపట్నం నుంచి పరిపాలన సాగించడంపై ప్రభుత్వం మరో క్లారిటీ ఇచ్చింది. జులై 23వ తేదీన విశాఖ నుంచి పరిపాలన సాగించడం దాదాపు ఖరారైనట్టేనని జిల్లాకు చెందిన పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ పరోక్ష సంకేతాలను ఇచ్చారు. అమరావతి నుంచి పరిపాలన ఎక్కువ రోజులు ఉండబోదని చెప్పారు. విశాఖ కేంద్రంగా పరిపాలన సాగించడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటోన్నామని స్పష్టం చేశారు. దీనికోసం అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములు, భవనాలను మాత్రమే వినియోగిస్తామని తేల్చి చెప్పారు.
ఈ ఉదయం ఆయన విశాఖపట్నంలో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ భూముల్లోనే విశాఖ పరిపాలనా రాజధాని నిర్మాణం కొనసాగుతుందని అవంతి శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వ అవసరాల కోసం ప్రైవేట్ భూములు అవసరం లేదని, వాటిపై ఆధారపడబోమని చెప్పారు. విశాఖలో ప్రభుత్వ భూములు చాలినంతగా ఉన్నాయని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కబ్జా చేసిన భూములన్నింటినీ స్వాధీనం చేసుకుంటోన్నామని, వాటిని పేదలకు పంపిణీ చేస్తామని అన్నారు.
చంద్రబాబు హయాంలో విశాఖను తమ అడ్డాగా మార్చుకుని భారీగా ప్రభుత్వ భూములను ఆ పార్టీ నాయకులు ఆక్రమించుకున్నారని చెప్పారు. టీడీపీ నేతలపై రాజకీయంగా కక్షసాధిస్తోన్నారంటూ వస్తోన్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. ఆ అవసరం తమ ప్రభుత్వానికి లేదని అన్నారు. ప్రభుత్వ భూములను ఎవరు ఆక్రమించుకున్నా, వాటిని విడిపించాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారు ఎంతటివారైనా చర్యలు తప్పవని అవంతి శ్రీనివాస్ హెచ్చరించారు. టీడీపీ నేతల భూ కబ్జాలపై చంద్రబాబు స్పందించాలని, దీన్ని సమర్థించగలరా? ఆయన ప్రశ్నించారు.
రెండేళ్లలో విశాఖలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని.. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే తమ ఉద్దేశమని మంత్రి అవంతి పేర్కొన్నారు. విశాఖ భూముల కుంభకోణంపై సిట్ నివేదిక బయటపెడతామని అవంతి చెప్పారు. టీడీపీ నేతలు కబ్జా చేసిన భూములను పేదలకు పంపిణీ చేస్తామని పునరుద్ఘాటించారు. త్వరలో ఎన్ఏడీ ఫ్లైఓవర్, భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. టీడీపీ నేతలు బయటకు రాకుండా జూమ్లో టైమ్ పాస్ చేస్తూ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని ఎమ్మెల్యేలు ఆదీప్ రాజ్, తిప్పల నాగిరెడ్డి విమర్శించారు.