విశాఖ నుండే ఇక పాలన..! ముహూర్తం ఖరారు:అదే జగన్ ధీమా: అధికారులకు సీఎం మార్గనిర్దేశం...!
అమరావతి: ఏపీలో మూడు రాజధానులు..విశాఖ నుండి పరిపాలన మరోసారి తెర మీదకు వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికలు..కరోనా కారణంగా ఈ మే నాటికి విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటు సాధ్యమా..కాదా అనే చర్చ సాగుతోంది. ఇదే సమయంలో మూడు రాజధానుల బిల్లులపైన మండలిలో సెలెక్ట్ కమిటీకి పంపాలనే నిర్ణయం పైన తేలని వివాదం..అదే సమయంలో హైకోర్టులో కార్యాలయాల తరలింపు వ్యవహారం పెండింగ్ లో ఉండటంతో ఈ సందేహాలు మొదలయ్యాయి. అయితే, ఇవన్నీ సాగుతుండగానే..తాము అనుకున్న విధంగానే ఈ వేసవిలోనే పరిపాలనా రాజధాని విశాఖ నుండే ప్రారంభించాలని సీఎం జగన్ పట్టదలతో ఉన్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా ముహూర్తం సైతం ఖరారు చేసారు. ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్ గా మారుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది ఎంత వరకు సాధ్యం అవు తుందనే సందేహమూ వెంటాడుతోంది.
విశాఖ నుండి పాలన..ముహూర్తం ఇదే..
ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నా..మూడు రాజధానుల విషయంలో ముందుకే వెళ్లాలని ముఖ్యమంత్రి జగన్ పట్టుదలతో ఉన్నారు. ప్రస్తుతం మరో మూడు నెలల వరకు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే అవకాశం కనిపించటం లేదు. కార్యాలయాల తరలింపు వ్యవహారం ప్రస్తుతం హైకోర్టులో ఉంది. అయినా..సాంకేతికంగా..న్యాయ పరంగా కొత్త పరిష్కార మార్గాలు ముఖ్యమంత్రి ముందుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో.. ఈ వేసవి ముగిసిపోతే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకు ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వేసవిలోనే విశాఖ నుండి పాలన ప్రారంభించేందుకు కసరత్త చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం అవతరణకు ముహూర్తం ఖరారు చేసారని విశ్వసనీయ వర్గాల సమాచారం. మే 26 నుంచి విశాఖ కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాలు ప్రారంభించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం.
సెలెక్ట్ కమిటీకి బిల్లులపై కొత్త లాజిక్..
మూడు రాజధానులకు అనుకూలంగా జనవరి 20న కేబినెట్ లో ఆమోదించి..అదే రోజున అసెంబ్లీలో బిల్లలు పాస్ చేసారు. అయితే, శాసన మండలిలో రెండు రోజుల పాటు చర్చ జరిగిన తరువాత జనవరి 22న మండలిలో బిల్లులకు బ్రేక్ పడింది. మండలి ఛైర్మన్ తన విచక్షణాధికారం మేరకు రెండు బిల్లులను సెలెక్ట కమిటీకి పంపుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం చెబుతున్న సమాచారం మేరకు నిబంధనల ప్రకారం నాలుగు నెలల కాలంలో కౌన్సిల్ ఆమోదం లేకున్నా బిల్లు చట్ట రూపుదాల్చుతుందని చెబుతున్నారు. దీంతో.. మే 25 నాటికి వికేంద్రీకరణ చట్టం అమలులోకి వస్తుందని జగన్ సర్కార్ అంచనా వేస్తోంది. దీంతో.. ఈ ప్రక్రియ మే 25 నాటికి పూర్తవుతుందని ప్రభుత్వ భావనగా కనిపిస్తోంది. న్యాయపరమైన అడ్డంకులు కూడా ఆ నాటికి తొలగుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఎలాంటి పరిస్థితిలోనైనా మే 26 నుంచి విశాఖ నుంచే తన కార్యకలాపాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయమని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
అమలు సాధ్యమేనా..
విశాఖ నుండి పాలన ప్రారంభించాలని ముఖ్యమంత్రి పట్టుదలతో ఉన్నా.. అధికారులు కార్యాచరణ సిద్దం చేస్తున్నా అమలు లో మాత్రం అనేక సందేహాలు వెంటాడుతున్నాయి. మూడు బిల్లులకు మండలిలో ఆమోదం లేకున్నా.. నాలుగు నెలల వరకు సెలక్ట్ కమిటీకి పంపకుంటే ఆటోమేటిక్ గా ఆమోదం పొందినట్లేనని ప్రభుత్వంలోని పెద్దలు వాదిస్తున్నారు. కానీ, అది కేవలం ద్రవ్య బిల్లులకు మాత్రమే వర్తిస్తుందని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇక, ఇప్పుడు కరోనా సమస్య ఏపీలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలోనూ టెన్షన్ గా మారుతోంది. ఏపీలోనూ ఇప్పటి వరకు ఇద్దరు కరోనా బారిన పడినట్లుగా గుర్తించారు. వీటితో పాటుగా కీలకంగా న్యాయ పరమైన చిక్కులు వెంటాడుతున్నాయి. కర్నూలుకు న్యాయ పరమైన సంస్థల తరలింపు పైన హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉంది. ఈ నెల 30న మరోసారి విచారణకు వాయిదా పడింది. ఇక, మండలి రద్దు పైన రాష్ట్రపతి ఉత్తర్వులిచ్చే వరకూ మండలి లైవ్ లో ఉంటుంది. దీంతో..అనేక సాంకేతిక..న్యాయ పరమైన అంశాలు ప్రభుత్వ ఆలోచనకు అడ్డుగా మారుతున్నాయి. మరి..ఇప్పుడు ప్రభుత్వం తాజాగా నిర్ణయించిన విశాఖ నుండి పాలనా ముమూర్తం ఎంత వరకు సాధ్యం అవుతుందనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.