విశాఖ ఆర్. ఆర్ వెంకటాపురంలో గ్రామస్తుల ఆందోళన .. మంత్రుల నిలదీత .. ఉద్రిక్తత
ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి విష వాయువు లీక్ తర్వాత తమను పట్టించుకోలేదని విశాఖ ఆర్ఆర్ వెంకటాపురంలో స్థానికులు ఆందోళనకు దిగారు. తమ గ్రామాన్ని ప్రభుత్వం విస్మరించిందంటూ ప్రజలు నేడు ధర్నా చేపట్టారు. తమ గ్రామంలో కంపెనీ ఉన్నా ప్రభుత్వం మాత్రం ఇక్కడి ప్రజలను పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నేడు ఐదు గ్రామాల్లో గ్రామస్తులతో కలిసి రాత్రి బస చెయ్యాలని వచ్చిన మంత్రులను గ్రామస్తులు అడ్డుకున్నారు.
ఎల్జీ పాలిమర్స్ బాధిత గ్రామాల్లో ఈ రాత్రికి బస చెయ్యనున్న మంత్రులు..ఎందుకంటే
తమ గ్రామాన్ని ప్రభుత్వం విస్మరించిందంటూ స్థానికుల ఆందోళన
తమ గ్రామాన్ని ప్రభుత్వం విస్మరించిందంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. తమకు ఇంట్లో కనీసం నిత్యావసరాలు కూడా లేవని, తినటానికి కూడా తిండి లేక ఇబ్బంది పడుతున్నామని వారు పేర్కొన్నారు . ఇప్పుడే ఇలా ఉంటె భవిష్యత్ లో తమ పరిస్థితి ఏమిటని వారు మంత్రులను నిలదీశారు. దీంతో మంత్రులు స్థానికులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు . మంత్రి అవంతి మాట్లాడుతూ ప్రభుత్వం ఎవరినీ విస్మరించలేదని చెప్పారు. ఇక్కడ పర్మినెంట్గా హెల్త్ క్యాంప్ పెట్టమని ముఖ్యమంత్రి చెప్పారన్నారు.
నివేదిక వచ్చే వరకు కంపెనీ మూసే ఉంటుందన్న మంత్రులు
జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారని చెప్పారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి అవంతి చెప్పుకొచ్చారు . మంత్రి కన్నబాబు మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో ఎల్జీ పాలిమర్స్ను తెరవరని గ్రామస్తులు ఈ విషయంలో ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు. నివేదిక వచ్చే వరకు కంపెనీ మూసే ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో ఒక్క టన్ను కూడా స్టైరిన్ ఉండొద్దని సీఎం జగన్ చెప్పారని, ఇప్పటికే పోర్టులో ఉన్న రెండు ట్యాంక్ల స్టైరిన్, పరిశ్రమలో ఉన్న స్టైరిన్ తరలించేందుకు 2 షిప్లు ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు.
రూమర్స్ నమ్మొద్దు .. మీతో పాటు ఉంటామని హామీ
ఇక ఆర్. ఆర్ వెంకటాపురం లోనే కాదు మొత్తం ఐదు గ్రామాలలో ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందన్నారు. తాము ఇక్కడే రెండుమూడు రోజులు ఉంటామని బొత్స సత్యనారాయణ చెప్పారు.ఎవరికి ఏ అవసరం ఉన్నా ప్రభుత్వం చూస్తుందని , ఎలాంటి అపోహలకు గురి కావద్దని చెప్పారు. సోషల్ మీడియా రూమర్స్ గాని, వదంతులు గాని ఎవ్వరూ కూడా నమ్మవద్దు అని పేర్కొన్నారు. నేడు రాత్రికి ప్రజలకు ఇబ్బంది లేకుండా భోజన వసతి కూడా ఏర్పాటు చేశామని మీతో పాటే ఉంటామని పేర్కొన్నారు.