సంచైతకు తొలి విజయం- కేంద్రం ప్రశంసలు...ప్రసాద్ పథకానికి ఎంపికైన సింహాచలం ఆలయం..
సంచలన రీతిలో విజయనగరం జిల్లాలోని మాన్సాస్ ట్రస్టుతో పాటు విశాఖలోని సింహాచలం ఆలయ ఛైర్మన్ బాధ్యతలు చేపట్టిన పూసపాటి వంశ వారసురాలు సంచైత గజపతిరాజు తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఎన్ని విమర్శలు ఎదురైనా లెక్క చేయకుండా సింహాచలం ఆలయ అభివృద్ధిపై దృష్టిసారించారు. ఇప్పుడు ఆమె చేస్తున్న కృషికి తొలి ఫలితం లభించింది. ఇన్నాళ్లూ తనను విమర్శించిన వారికి ఈ విజయం చెంపపెట్టులా మారబోతోంది.
కేంద్ర ప్రభుత్వం 11వ శతాబ్దానికి చెందిన సింహాచలం వరాహ లక్ష్మీ నృసింహస్వామి ఆలయాన్ని ప్రసాద్ పథకానికి ఎంపిక చేసింది. పిలిగ్రిమేజ్ రెజువినేషన్ అండ్ అగ్మెంటేషన్ డ్రైవ్ పేరుతో పిలుస్తున్న ఈ పథకం ద్వారా దేశంలో ఎంపిక చేసిన ఆలయాల అభివృద్ధికి కేంద్ర పర్యాటక శాఖ నిధులు మంజూరు చేస్తుంది. ఈ నిధులతో ప్రముఖ పర్యాటక, ఆథ్యాత్మిక ప్రదేశాలను అభివృద్ధి చేయడమే ప్రసాద్ పథకం లక్ష్యం. ఇదే కోవలో ఇప్పటికే రాష్ట్రంలోని శ్రీశైలం, తిరుపతి దేవస్ధానాలు ఎంపికయ్యాయి. వీటితో పాటు సింహాచలం ఆలయాన్ని కూడా ఎంపిక చేసిన కేంద్రం.. ఆలయ అభివృద్ధికి మాన్సాస్ ఛైర్మన్ హోదాలో కృషి చేస్తున్న సంచయితను ప్రశంసిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.
మాన్సాస్ తో పాటు సింహాచలం ఆలయం బాధ్యతలు కూడా ఒకేసారి చేపట్టిన సంచయిత ఆ తర్వాత ఈ ఆలయం అభివృద్ధికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా గతంలో తన బాబాయ్ నెలకొల్పిన పలు సంప్రదాయాలను మార్చడంతో పాటు అధికారులకు కూడా స్వేచ్ఛనిచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆలయ అభివృద్ధికి అవకాశాలు మెరుగుపడ్డాయి. ఇప్పుడు ప్రసాద్ పథకానికి కూడా ఎంపిక కావడంతో ఇక సింహాచలం ఆలయ ప్రతిష్ట మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.