మరోసారి ఎల్జీ పాలిమర్స్ లో స్టైరిన్ గ్యాస్ లీక్... అలెర్ట్ అయిన అధికారులు ..ప్రాణభయంతో ప్రజలు
విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో ఈ తెల్లవారు జామున స్టైరీన్ గ్యాస్ లీక్ కావడంతో దాని ప్రభావం సమీపంలో ఉన్న ఐదు గ్రామాలపై పడింది. ముఖ్యంగా ఆర్. ఆర్ వెంకటాపురం వాసులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. .
దాదాపుగా 2000 మంది ఈ గ్యాస్ ను పీల్చడం వలన కళ్ళు మంటలు, దద్దుర్లు , కడుపు నొప్పి, వాంతులు వంటి లక్షణాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. చాలా మంది విష వాయువు పీల్చటం వల్ల అపస్మారక స్థితికి చేరుకున్నారు . ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 8 కి చేరింది.
ఉదయం నుంచి గ్యాస్ లీక్ ను కంట్రోల్ చేసేందుకు విపత్తు సహాయక బృందాలు రంగంలోకి దిగి ప్రయత్నాలు మొదలు పెట్టాయి. మరోపక్క హెలికాఫ్టర్ల ద్వారా నెలలు చల్లుతూ గ్యాస్ ప్రభావం తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు .
ఒక సమయంలో గ్యాస్ లీకేజ్ కంట్రోల్ లోకి వచ్చాయని వార్తలు వచ్చాయి.కానీ, తాజా సమాచారం ప్రకారం ఫ్యాక్టరీ నుంచి మరోసారి గ్యాస్ లీక్ కావడం మొదలైంది. దీంతో అప్రమత్తం అయిన పోలీసులు అలారం మోగించి వెంటనే ప్రజలు ఖాళీ చేసి వెళ్లిపోవాలని, పరిస్థితి సీరియస్ గా ఉందని హెచ్చరికలు జారీ చేశారు.
తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎవరూ సమీప ప్రాంతాలకు రావొద్దని పరిసర గ్రామాల ప్రజలకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. డిజాస్టర్ టీం తప్పించి ఎవరూ కూడా ఉండొద్దని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.
Recommended Video
మరోపక్క యుద్ధ ప్రాతిపదికన గ్యాస్ లీకేజ్ తగ్గించటానికి శత విధాలా ప్రయత్నాలు చేస్తున్నారు . ఇక సమీప ప్రాంతాల ప్రజలు భయంతో పరుగులు పెడుతున్నారు .ప్రస్తుతానికి గ్యాస్ లీక్ ఆగిపోయిందని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రకటించిన కొద్దిసేపటికే గ్యాస్ మరోసారి లీక్ కావడంతో స్థానికంగా ఆందోళన నెలకొంది .