ఆనం అలా..బొత్స ఇలా: ఎక్కడ నొప్పి కలిగిందో మరి..
అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరుపతి జిల్లా వెంకటగిరి శాసన సభ్యుడు ఆనం రామనారాయణ రెడ్డి రూపంలో అసంతృప్త గళం తరచూ వినిపిస్తోంది. ఇప్పటివరకు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురానికి చెందిన లోక్ సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు ఒక్కరే తిరుగుబాటు నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆనం రామనారాయణ రెడ్డి కూడా అదే బాటలో సాగుతున్నారు. మంత్రి పదవి దక్కట్లేదనే అసహనం ఆయనలో స్పష్టంగా కనిపిస్తోందనే వాదనలు లేకపోలేదు.
టార్గెట్ చైనా- వైమానిక దళం అమ్ములపొదిలో సరికొత్త బ్రహ్మాస్త్రం..!!
ఆనం వ్యాఖ్యలతో..
సొంత పార్టీ సారథ్యంలోని ప్రభుత్వంపై ఆనం రామనారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైఎస్ఆర్సీపీలో కలకలం రేపుతున్నాయి. రోడ్లపై గోతులు కూడా పూడ్చలేని పరిస్థితి నెలకొని ఉందని, మంచి నీళ్లు అడిగినా గానీ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే నిధుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో ఎమ్మెల్యేల చేతుల మీదుగా ఎలాంటి పనులు సాగట్లేదని, ఇక ఏ పని చేశామని తాము ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడుగుతామని పేర్కొన్నారాయన.
ఎక్కడ నొప్పి కలిగిందో..
పింఛన్లు ఇచ్చినంత మాత్రాన ఓట్లు పడతాయని తాను అనుకోవట్లేదని, గత ప్రభుత్వాలు కూడా వాటిని మంజూరు చేశాయని ఆనం రామనారాయణ రెడ్డి నేరుగా ప్రశ్నించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనిపై వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వైఎస్ఆర్సీపీ అగ్ర నాయకత్వానికి ఏర్పడింది. దీనిపై పార్టీ అధికార ప్రతినిధి సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. ఆనం రామనారాయణ రెడ్డికి ఎక్కడ నొప్పి కలిగిందో తనకు తెలియట్లేదని వ్యాఖ్యానించారాయన
ఆనం అలా.. బొత్స ఇలా..
మరో సీనియర్ నాయకుడు, విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాత్రం వైఎస్ జగన్ నాయకత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆ కోణంలో మరోసారి వ్యాఖ్యానాలు చేశారు. ఆనం రామనారాయణ రెడ్డిపై కౌంటర్ అటాక్ చేసినట్లుగా మాట్లాడారు బొత్స. వైఎస్ జగన్ రెక్కల కష్టం మీదే అధికారంలోకి వచ్చామని ఆయన తేల్చి చెప్పారు. పార్టీ శాసన సభ్యులందరూ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని పరోక్షంగా ఆనంను ఉద్దేశించి పేర్కొన్నారు.
భేదాభిప్రాయాలకు తావులేదు..
ఇవ్వాళ ఆయన విజయనగరం జిల్లా రాజాం నియోకవర్గంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. పార్టీలో భేదాభిప్రాయాలకు తావు లేదని, ప్రతి ఒక్కరం విధేయతగా ఉండాల్సిందేనని పేర్కొన్నారు. చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉంటే వాటిని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలే తప్ప బాహటంగా వ్యాఖ్యలు చేయడం వల్ల ఉపయోగం ఉండదని చెప్పారు. రాజాం నియోజకవర్గానికి చెందిన నాయకులను ఉద్దేశించి చెప్పిన మాటలే అయినప్పటికీ- ఆనం రామనారాయణ రెడ్డి ఉదంతాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించినట్లుగా చెబుతున్నారు.
చంద్రబాబుపైనా..
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడిపైనా బొత్స సత్యనారాయణ విమర్శలు చేశారు. తాను ఏం చేశాడో చెప్పుకోలేని దుస్థితిని చంద్రబాబు ఎదుర్కొంటోన్నారని, అందుకే ప్రభుత్వంపై అనుక్షణం బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖపట్నాన్ని రాజధానిగా చేయాలని ఉత్తరాంధ్ర ప్రజలు కోరుకుంటున్నారని, దీనికి భిన్నంగా టీడీపీ వ్యవహరిస్తోందని, దీనికి కారణం- చంద్రబాబు బినామీలేనని అన్నారు.
సైకిల్ పోవాలి..
సైకిల్ పోవాలంటూ.. చంద్రబాబు మనస్సులోని మాటలను దేవుడే అనిపించాడని బొత్స సత్యనారాయణ విమర్శించారు. టీడీపీ పని అయిపోయిందని, జవసత్వాలను కోల్పోయిందని పేర్కొన్నారు. జాకీలు, క్రేన్లు పెట్టి టీడీపీని లేపినా ఉపయోగం ఉండబోదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర సమతులాభివృద్ధి కోసం తాము మూడు రాజదానులను ప్రతిపాదిస్తే- చంద్రబాబు మాత్రం అభివృద్ధికి కేంద్రీకరించేలా అమరావతే కావాలంటున్నారని ధ్వజమెత్తారు.
ఎందుకు వద్దంటున్నారు?
అయిదు లక్షల కోట్ల రూపాయలను తీసుకెళ్లి అమరావతిలో తన చుట్టాలు, బంధువులు, తాబేదార్లకు కట్టబెట్టాలనేది చంద్రబాబు వ్యూహమని, అది ఎట్టి పరిస్థితుల్లోనూ కార్యరూపం దాల్చదని బొత్స తేల్చి చెప్పారు. ఉత్తరాంధ్రలో కార్యనిర్వాహక రాజధానిని ఏర్పాటు చేయడాన్ని టీడీపీ నాయకులు కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడు, అశోక్ గజపతి ఎందుకు వద్దంటున్నారని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.