పాలకుల ప్రేమ మాటల్లోనే.. విజయనగరం ఏజెన్సీలో గిరిజన మహిళ ప్రసవానికి తప్పని డోలీ కష్టాలు
గిరిజన సంక్షేమం కోసం ఎంతో చేస్తున్నామని ప్రభుత్వాలు లెక్కలు చెబుతున్నాయి. గిరిపుత్రుల కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నామని, అటవీ ఉత్పత్తులను విక్రయించడానికి గిరిజన సహకార సంస్థలు పనిచేస్తున్నాయని పాలకులు గిరిజనుల పట్ల మాటల్లో చెప్పలేనంత ప్రేమను కుమ్మరిస్తున్నారు. కానీ వాస్తవ గిరిజనుల పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. క్షేత్ర స్థాయిలో గిరిజనుల గోడు వినే నాధుడే లేదు. కేవలం ఎన్నికల సమయంలో కనిపించే నాయకులే తప్ప, వారి కష్టాలను తీర్చి కన్నీళ్లను తుడిచే నాయకులు లేరని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడుగడుగున సౌకర్యాలతో, ఇబ్బందులతో పడరాని పాట్లు పడుతున్న గిరిజనులు ఆవేదనలో ఉన్నారు.
ప్రసవ వేదనకు మించిన వేదన అనుభవిస్తున్న గిరిజనులు
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్న గిరిజనులు సౌకర్యాల లేమితో ఇబ్బందులు పడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన గర్భిణీ మహిళలు ఆసుపత్రులకు వెళ్లడానికి ప్రసవవేదన కు మించిన బాధలను అనుభవిస్తున్నారు. గిరిజన గూడేలకు సమీపంలో ఆసుపత్రులు లేకపోవడం, కనీసం వాహనాలు కూడా వెళ్లేందుకు రోడ్లు లేకపోవడం వంటి సమస్యలతో డెలివరీ నొప్పులతో బాధపడుతున్న మహిళలను డోలీలు కంటి ఆసుపత్రికి తరలించాల్సి న పరిస్థితి నేటికీ కనిపిస్తుంది.
భారత దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా, అన్ని రంగాలలో అభివృద్ధి చెందామని చెబుతున్నా, గిరిజన ప్రాంతాలలోని పరిస్థితులు, గర్భిణీ మహిళలను డోలి కట్టి ఆసుపత్రికి తీసుకు వెళుతున్న సంఘటనలు మన ప్రగతిని వెక్కిరిస్తున్నాయి. పాలకుల పనితీరును ప్రశ్నిస్తున్నాయి.
ఇటీవల విశాఖ ఏజెన్సీలో గర్భిణీని డోలీ కట్టి 20 కిమీ ఆస్పత్రికి మోసుకెళ్ళిన ఘటన
మొన్నటికి మొన్న పురిటి నొప్పులతో బాధపడుతున్న ఒక మహిళనుడోలీలో మోసుకుంటూ 20 కిలోమీటర్ల మేర నడిచి డెలివరీ కోసం ఆస్పత్రికి తరలించిన ఘటన విశాఖ ఏజెన్సీలో చోటుచేసుకుంది.విశాఖ ఏజెన్సీలోని చింతపల్లి మండలం బలపం పంచాయతీ మారుమూల గ్రామమైన తోకపాడులో కుసంగి చంద్రమ్మ అనే నిండు గర్భిణీకినొప్పులు రావడంతో ఆమెను ఆసుపత్రికితరలించారు.అయితే రోడ్డు మార్గం కూడా లేకపోవడంతోడోలీకట్టి,డోలీలో గర్భిణీ మహిళనుపడుకోబెట్టి20 కిలోమీటర్ల మేరమోస్తూ నడుచుకుంటూ ఆమెను ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. ప్రసవ వేదనను మించిన నరకయాతన ఆ గర్భిణీ మహిళ అనుభవించింది. దాదాపు ఆసుపత్రికి తీసుకువెళ్లడానికి 20 గంటలకు పైగా పట్టిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
విజయనగరం జిల్లా ఎస్ కోట పరిధిలోనూ నిండు చూలాలు నరకయాతన
ఇక తాజాగా విజయనగరం జిల్లా ఎస్ కోట మండలం రేగ పుణ్యగిరి, గిరిశిఖర గ్రామానికి చెందిన గర్భిణీ మహిళకు పురిటి నొప్పులు రావడంతో ఆమెను డోలీలో మూసుకుంటూ ఎనిమిది కిలోమీటర్ల మేర నడిచి ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. వంతల శాంతి అనే గర్భిణీ మహిళలకు నొప్పులు రావడంతో ఆసుపత్రికి తరలించడానికి ఆమె బంధువులు పడరాని పాట్లు పడ్డారు. గిరిశిఖర గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో డోలీ కట్టి మహిళను అందులో పడుకోబెట్టి ఆసుపత్రికి తరలించాల్సి న పరిస్థితిపై గిరిజనులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఓట్ల కోసం వచ్చే నాయకులు తమ పాట్లు చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు . ఇప్పటికైనా తమ గ్రామానికి రోడ్డు సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళయినా గిరిజనుల బతుకులు కష్టాల్లోనే
మొన్న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అధికార పార్టీ నాయకులు గిరిజన సంక్షేమం కోసం ఎంతో చేశామని ఊకదంపుడు ఉపన్యాసాలు చెబుతున్నారని గిరిజనులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. రహదారి మార్గం లేక, మౌలిక సదుపాయాలు లేక గిరిజనులు నిత్య నరకం చూస్తున్నా పాలకులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా ఏజెన్సీ ప్రాంతాలలో గ్రామాలకు రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేసి గిరిజనుల కష్టాలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే భవిష్యత్తులో గిరిజనులు పెద్ద ఎత్తున పోరాటానికి సైతం వెనుకాడబోరని తేల్చి చెబుతున్నారు.
డోలీ కష్టాలు వర్ణనాతీతం ... ప్రాణాలను పణంగా పెడుతూ సాహసం
డోలీలు కట్టి గర్భిణీ మహిళలను ఆసుపత్రులకు తరలించటం చాలా కష్టంతో కూడుకున్న పని. అటవీ మార్గంలో ఎలాంటి రోడ్డు లేని ప్రాంతాలలో నడుస్తూ నిండు గర్భిణీ మహిళను మోస్తూ చేసేది నిజంగా ఒక సాహసమే. ఒక మహిళ డెలివరీ కావాలంటే డోలీ మోయటానికి కనీసం నలుగురు మగవాళ్ళు అవసరం. ఇక మార్గ మధ్యలో వర్షం వచ్చినా, ఎలాంటి ఇబ్బంది కలిగినా వారి బాధ వర్ణనాతీతం. ఇలా డోలీలలో ప్రసవ వేదనతో ఉన్న మహిళలను తరలిస్తున్న క్రమంలో పరిస్థితి విషమించి ఎంతోమంది మహిళలు మృత్యువాత పడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి.
సౌకర్యాల లేమి వల్ల గాల్లో కలిసిపోతున్న గిరిజనుల ప్రాణాలు .. పాలకులూ పట్టించుకోండి
అంతేకాదు వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలి, ఆసుపత్రులకు వెళ్లలేక మన్నెం లోనే ప్రాణాలు కోల్పోతున్న అడవి బిడ్డలు ఎందరో ఉన్నారు. అమాయక గిరిజనుల ప్రాణాలు గాలిలో కలిసిపోకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఎంతైనా ఉంది. రాష్ట్రంలో మంత్రులుగా గిరిజన ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులు వారిపై దృష్టి సారించాలి. గిరిజన సంక్షేమం కోసం నిధులు కేటాయిస్తున్న ప్రభుత్వాలు, నిత్యకృత్యంగా మారుతున్న గిరిజన మహిళల డోలీ కష్టాలపై దృష్టిసారించాలి.
స్త్రీ శిశు సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నామని మాటలు చెప్పటం కాదు అది ఆచరణలో చూపించాలి . వారికి వైద్య సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా, రోడ్డు రవాణా మెరుగుపరిచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.