ధర్మకర్తగా అశోక్ గజపతిరాజుకు తెలియకుండా ఉంటుందా?: భువనేశ్వరి, బ్రాహ్మణిలను అడగండి: సంచైత
విజయనగరం: విజయనగరం జిల్లాలోని చారిత్రాత్మక ఆలయం రామతీర్థం పుణ్యక్షేత్రంలో చోటు చేసుకున్న ఘటన పట్ల చెలరేగిన రాజకీయ వేడి ఇప్పట్లో చల్లారేలా కనిపించట్లేదు. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రామతీర్థం క్షేత్రాన్ని సందర్శించిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు మరింత దుమారాన్ని రేపుతున్నాయి. ఆయనపై ప్రతిదాడులకు కారణమౌతున్నాయి. ఇప్పటికే మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, బొత్స సత్యనారాయణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వీ విజయసాయి రెడ్డి.. ఆయనపై ఎదురుదాడికి దిగారు.. తాజాగా మన్సాస్ ట్రస్ట్ ఛైర్పర్సన్ సంచైత గజపతి రాజు ఈ లిస్ట్లో చేరారు.
అశోక్ గజపతిరాజుకు తెలియకుండా ఉంటుందా?
రామతీర్థం ఆలయంలోని శ్రీరామచంద్రమూర్తి విగ్రహం ధ్వంసం కావడానికి అశోక్ గజపతి రాజు బాధ్యత వహించాల్సి ఉంటుందని సంచైత విమర్శించారు. రాములవారి విగ్రహం నుంచి తలను వేరు చేసిన ఘటన అశోక్ గజపతి రాజు ఆలయ ధర్మకర్తగా ఉన్నప్పుడే చోటు చేసుకుందని అన్నారు. ఈ ఘటన తరువాతే.. ప్రభుత్వం ఆయనను ధర్మకర్త పదవి నుంచి తొలగించిందని గుర్తు చేశారు. తాను ధర్మకర్తగా ఉంటోన్న ఆలయంలో ఏ జరుగుతోందనే విషయం అశోక్కు తెలియకుండా ఉంటుందా? అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు.
బాధ్యులు ఎవరో తెలుసుకోలేని స్థితిలో చంద్రబాబు..
రామతీర్థం ఆలయంలో చోటు చేసుకున్న ఉదంతానికి బాధ్యతలు ఎవరో కూడా తెలుసుకోలేని స్థాయిలో చంద్రబాబు ఉన్నారని సంచైత గజపతి రాజు ఆరోపించారు. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఇదేనా అని నిలదీశారు. చంద్రబాబు స్నేహితుడు, తన బాబాయ్ అశోక్ గజపతి రాజు ఆలయ ధర్మకర్తగా ఉన్నారనే విషయం చంద్రబాబుకు తెలియదా అని ప్రశ్నించారు. రామతీర్థం ఆలయంలో ఎలాంటి తప్పులు చోటు చేసుకున్నప్పటికీ.. ఒక బాధ్యత గల ధర్మకర్తగా దానికి అశోక్ గజపతిరాజు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.
తనను మహాతల్లిగా సంబోధించడం పట్ల..
రామతీర్థం ఆలయంలో విగ్రహాన్ని ధ్వంసం చేసినప్పటికీ.. సంచైత గజపతి సంఘటనా స్థలానికి రాలేదని, ఆమె కనీసం ఇటువైపు కన్నెత్తి చూడలేదని చంద్రబాబు విమర్శించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన సంచైతను మహాతల్లిగా సంబోధించారు. దీనికి సంచైత ఘాటుగా బదులు ఇచ్చారు. తనను మహాతల్లిగా సంబోధించడాన్ని తప్పు పట్టారు. మహిళ పట్ల తనకు ఉన్న అగౌరవాన్ని చంద్రబాబు మరోసారి బయటపెట్టుకున్నారని విమర్శించారు.
చంద్రబాబు ఇంట్లో ఇద్దరు ఆడవాళ్లు..
తనను మహాతల్లీ అంటూ వ్యంగ్యంగా సంబోధించడం ఆయన సంకుచిత ధోరణికి నిదర్శనమని అన్నారు. చంద్రబాబు ఇంట్లో కూడా ఇద్దరు మహిళలు ఉన్నారని, ఆడవాళ్లని ఉద్దేశించి ఎలా మాట్లాడాలో వారిని అడిగి తెలుసుకోవాలని చురకలు అంటించారు. దేవాలయాలను పరిశుభ్రం చేసే కాంట్రాక్టు పనులను చంద్రబాబు తన బంధువులకు కట్టబెట్టిన విషయాన్ని సంచైత ప్రస్తావించారు.
తన మనుషులను ఏదోరకంగా ఆలయాల్లో కూర్చోబెట్టి, వారి ద్వారా దోపిడీకి పాల్పడ్డారని, అలాంటి సంకుచిత భావాలు తనకు లేవని అన్నారు. మన్సాస్ ట్రస్టు ఆస్తులను టీడీపీ నాయకులకు పప్పుబెల్లాలు మాదిరికగా కట్టబెట్టిన చరిత్ర చంద్రబాబుకు ఉందని, ఆ బాగోతాలన్నీ త్వరలోనే బయటపడతాయని హెచ్చరించారు.