కూలికి బయలుదేరి కానరాని లోకాలకు -ఆటోను ఢీకొట్టిన తుఫాన్ -వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం
పొద్దున్నే ఇంటి చాకిరీ కానిచ్చేసి, బాక్సుల్లో అన్నం నింపుకొని, పొలం పనుల కోసం బయలుదేరిందో మహిళా కూలీల ముఠా. రోజూలాగే ఒక్క అపే ఆటోలో 18 మంది మహిళలూ సర్దుకుపోయారు. డ్రైవర్ సహా మొత్తం 19 మంది ప్రయాణిస్తున్న ఆ వాహనం ఘోరప్రమాదానికి గురైంది. ఎదురుగా దూసుకొచ్చిన తుఫాన్ వాహనం ఢీకొట్టడంతో ఆటో నుజ్జునుజ్జయిపోయింది.. వరంగల్ జిల్లాలో శుక్రవారం ఉదయం ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు, స్థానికులు చెప్పిన వివరాలివి..
హైదరాబాద్ - భూపాలపట్నం రహదారి 163 హైవేపై వరంగల్ జిల్లా పరిధిలోని ఆత్మకూరు మండలం నీరుకుళ్ల వద్ద శుక్రవారం తుఫాన్ వాహనం ఆటోను ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మహిళా కూలీలు దుర్మరణం చెందారు. మరో ఏడుగురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే హాస్పిటల్కు తరలించగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

తుఫాను వేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టడంతో అందులో ఉన్న వారంతా చెల్లాచెదురుగా రోడ్డుపై పడిపోగా.. ఆటో నుజ్జునుజ్జయింది. ములుగు నుంచి వరంగల్ వైపు వస్తున్న తుఫాన్.. వరంగల్ నుంచి దుగ్గొండి వైపు వెళ్తున్న ఆటోను ఢీకొనడంతో ఆటోలో ఉన్న వ్యవసాయ కూలీలు ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన వారిని వరంగల్ ఎంజీఎం హాస్పిటల్కు తరలించారు.

మృతులు మాడిశెట్టి సాంబలక్ష్మి (65), పాలకుర్తి సరోజన (55), మెహబూబీ (50)గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ హాస్పిటల్కు తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో డ్రైవర్ సహా 19 మంది కూలీలు ఉన్నారు. వీరంతా ఆత్మకూరు మండల కేంద్రం నుంచి దుగ్గొండి మండలం రంగాపురం గ్రామానికి మర్చి పంట కోసేందుకు ఆటోలో బయలుదేరగా ఈ దుర్ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.

వరంగల్ జిల్లాలోని ఆత్మకూరు మండలం నీరుకుళ్ల శివార్లలో జరిగిన రోడ్డు ప్రమాదం పట్ల మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలిపారు. ఇవాళ ఉదయం కూలీలతో వెళ్తున్న ఆటోను తుఫాను వాహనం ఢీకొట్టింది. దీంతో ముగ్గురు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడటం బాధాకరమని చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు యంత్రాంగంతో మాట్లాడి.. ఘటనకు దారి తీసిన పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రభుత్వ పరంగా ఆ కుటుంబాలను ఆదుకుంటామన్నారు.












Click it and Unblock the Notifications