5న కాళేశ్వరానికి సీఎం కేసీఆర్.. మేడిగడ్డ, పార్క్ నిర్మాణం పరిశీలన..
కాళేశ్వరం ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం మొదటి విడతలో రూ.600 కోట్లతో కాళేశ్వరం రిజర్వాయర్లు, పంపుహౌస్ల వద్ద గ్రీనరీ ఏర్పాటు చేయాలని అనుకుంటోంది. ఆ పనుల పరిశీలన కోసం సీఎం కేసీఆర్ ఈ నెల 5వ తేదీన భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో పర్యటించనున్నారు. పర్యటన అధికారికంగా ఖరారు కాలేదు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్లు మాత్రం సీఎం పర్యటనలో నిమగ్నమయ్యారు.
ప్రాజెక్టు వద్ద పార్కులు, హోటళ్లు, గెస్ట్హౌస్ నిర్మాణం చేపట్టేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. సీఎం కేసీఆర్ తన పర్యటనలో మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంపుహౌస్ వద్ద గెస్ట్హౌస్, పార్కుల నిర్మాణానికి శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. పర్యాటకులను ఆకట్టుకునేలా కాళేశ్వరం నుంచి మేడిగడ్డ వరకు బోటింగ్ ప్రాజెక్టుకు అధికారులు రూపకల్పన చేశారు.
సీఎం కేసీఆర్ పర్యటనకు సంబంధించిన వివరాలు అధికారికంగా ఖరారు కాలేదు. కానీ 5వ తేదీన కచ్చితంగా కాళేశ్వరం రావొచ్చని భావిస్తూ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులు కూడా భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. సీఎం పర్యటన ఖాయం అని.. అందులో మార్పు ఉండదని అధికారులు చెబుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులను దగ్గరుండి మరీ చూస్తానని సీఎం కేసీఆర్ చాలా సందర్భాల్లో చెప్పిన సంగతి తెలిసిందే. అయితే అందులో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శించి పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అందులో భాగంగానే మంగళవారం కాళేశ్వరం వస్తున్నారని తెలిసింది.