రూల్స్ బ్రేక్.. కోవిడ్ ఆస్పత్రులపై కొరడా, నోటీసులు జారీ
వరంగల్లో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న కొవిడ్ ఆస్పత్రులపై జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కొరడా ఝళిపించింది. కొవిడ్ చికిత్స అందిస్తున్న ఆస్పత్రులపై వైద్య, ఆరోగ్యశాఖ, టాస్క్ఫోర్స్ బృందం తనిఖీ నిర్వహించింది. గురువారం ఏడు కొవిడ్ ఆస్పత్రులలో టాస్క్ఫోర్స్ తనిఖీ నిర్వహించింది. కొవిడ్ పేషెంట్లకు చికిత్స అందిస్తున్న తీరు, రెమిడెసివిర్ ఇతర అవసరమైన మందుల లభ్యత, ఆక్సిజన్ లభ్యత, బిల్లింగ్ వంటి అంశాలను పరిశీలించారు.
చికిత్స సరిగా అందించని, అలాగే బిల్లింగ్ సరిగా లేని ఆస్పత్రులకు నోటీసులు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్వో కె.లలితాదేవి, జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వరప్రసాద్, అడిషనల్ డీఎంహెచ్వో టి.మదన్మోహన్రావు, డ్రగ్ఇన్స్పెక్టర్ రఫీషేక్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. వైద్య, ఆరోగ్యశాఖ ప్రోగ్రామ్ అధికారులు, డిప్యూటీ డీఎంహెచ్వో యాకూబ్పాషా, డీటీసీవో మల్లికార్జున్, స్టాటిస్టికల్ అధికారి ప్రసన్నకుమార్ తమ పరిధిలోని పలు ఆస్పత్రులను తనిఖీ చేశారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా కొవిడ్ చికిత్సలు చేసినట్లయితే కఠినమైన చర్యలు చేపడతామని, కేసులు నమోదు చేస్తామని ఈ సందర్భంగా డీఎంహెచ్వో లలితాదేవి హెచ్చరించారు.
హన్మకొండ బస్టాండు సమీపంలోని రాజు ఈఎన్టీ ఆస్పత్రిపై టాస్క్ఫోర్స్, డ్రగ్ ఇన్స్పెక్టర్ల దాడులు జరిపారు. వైద్యులు, ఫార్మసీ యజమాని ఇద్దరు కుమ్మక్కై రెమిడెసివిర్ ఇంజక్షన్లు బ్లాక్లో అమ్ముతుండగా పట్టుకున్నారు. ఆస్పత్రి యజమాని డాక్టర్ రాజు, ఫార్మసీ యజమానిపై కేసులు నమోదు చేశారు. కాగా, నిందితులను హన్మకొండ పోలీసులు అదుపులోకి తీసుకుని 14 రెమిడెసివిర్ ఇంజక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. అందులో చికిత్స తీసుకున్న రోగికి డాక్టర్ రాసిచ్చిన చిట్టి మేరకు ఇంజక్షన్లను మొదటి రోజు రూ.35వేలకు, రెండో రోజు రూ.27వేలకు, మూడోరోజు రూ.25వేలకు ఆస్పత్రి ఫార్మసీ యజమాని అమ్ముతుండగా టాస్క్ఫోర్సు పోలీసులు, డ్రగ్ ఇన్స్పెక్టర్ పట్టుకున్నారు.