ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీవర్షాలు; పలుచోట్ల రాకపోకలు బంద్, పాలేరువాగులో చిక్కుకున్న కూలీలు సేఫ్!!
తెలంగాణ రాష్ట్రాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ కుండపోతగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలతోనే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇక తాజాగా మరోమారు కురుస్తున్న భారీ వర్షాలు జన జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. నిన్నటి నుండి కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షం కారణంగా హన్మకొండ , వరంగల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, జనగామ, మహబూబాబాద్ జిల్లాలలో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
కుండపోత వర్షాలు... తాడ్వాయి పస్రా మధ్య వాగులు పొంగటంతో రాకపోకలు బంద్
హనుమకొండ జిల్లాలోని పలు మండలాల్లో 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది అంటే ఎంతగా కుండపోత వానలు కురుస్తున్నాయో తెలుసుకోవచ్చు. ఇదిలా ఉంటే ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం తాడ్వాయి పస్రా గ్రామాల మధ్య రెండు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో రాకపోకలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పస్రా నుంచి మేడారం మధ్యలో బొగ్గుల వాగు, వట్టి వాగు పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయినట్లు సమాచారం.
ములుగు పస్రా మధ్య కొట్టుకుపోయిన రహదారి
ఇక 163 జాతీయ రహదారి లో లెవెల్ కాజ్ వే పై నుండి వట్టి వాగు పొంగి ప్రవహించడంతో ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ఆర్టీసీ సర్వీసులను సైతం ఈ మార్గంలో నిలిపివేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి ములుగు జిల్లా పస్రా తాడ్వాయి మధ్యగల రహదారి కొట్టుకుపోయింది. మరోవైపు మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల అర్పనపల్లి వద్ద వట్టి వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. బ్రిడ్జి పై నుండి వరద నీరు ప్రవహిస్తుండటంతో కేసముద్రం గూడూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
ముత్తారం వాగులో చిక్కుకున్న ట్రాక్టర్, ట్రాక్టర్ లో ఉన్న వారంతా సేఫ్
ఇక మరోవైపు ములుగు జిల్లా వెంకటాపురం మండలం ముత్తారం గ్రామం ముత్తారం వాగు పొంగి ప్రవహిస్తుంది. వాగు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారడంతో, ట్రాక్టర్ లో వస్తున్న గ్రామస్తులు కొందరు వాగులో చిక్కుకున్నారు. ట్రాక్టర్ డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో బయటపడిన గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక అంతేకాదు చలి వాగు, మోరంచ, జంపన్న వాగులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో ఆయా మార్గాలలో వాహన రాకపోకలు నిలిచిపోయాయి.
దేవరుప్పల కొడకండ్ల మధ్య రాకపోకలు బంద్
ఇదిలా ఉంటే శుక్రవారం కురిసిన భారీ వర్షానికి పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల మండలాలలో పంట పొలాలు నీట మునిగాయి. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తుండటంతో దేవరుప్పుల, కొత్తపల్లి మధ్యలోని లో లెవెల్ వంతెనపై నుంచి వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోపక్క కొడకండ్ల మండల ప్రధాన రహదారి పక్కన ఉన్న రామవరం చెరువు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిపివేయాలని అదనపు కలెక్టర్ భాస్కరరావు పోలీసులను ఆదేశించారు. ఇక చెరువు ముందు తండా వద్ద ట్రాక్టర్లు అడ్డంపెట్టి పోలీసులను కాపలా పెట్టారు.
పాలేరువాగులో చిక్కుకున్న 23 మంది కూలీలు..రక్షించిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
మరోవైపు కొడకండ్ల వద్ద రాకపోకలు నిలిపి వేయడంతో మొండ్రాయి రహదారి తాత్కాలికంగా మూతపడింది. ఇదిలా ఉంటే మహబూబాద్ జిల్లా మరిపెడ మండలం చౌళ్ళ తండా కు చెందిన 23 మంది కూలీలు పాలేరు వాగులో చిక్కుకున్నారు. వరద ఉధృతికి పాలేరు వాగు దాటటం వారికి కష్టంగా మారడంతో తాము వాగులో చిక్కుకుపోయామని సెల్ఫీ వీడియో తీసి వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేశారు. దీంతో అధికారులు ఎన్డీఆర్ఎఫ్ బృందాలని రంగంలోకి దించి వారిని ఒడ్డుకు తీసుకువచ్చారు. ఇంకా మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.