క్రికెట్ బెట్టింగ్ లలో నష్టం .. పీకల్లోతు అప్పుల్లో, యూ ట్యూబ్ వీడియోలు చూసి ఇద్దరు ఏం చేశారంటే !!
క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడి అప్పుల పాలై వాటిని తీర్చేందుకు చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను వరంగల్ కమిషనరేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టు చేసిన దొంగల నుండి సుమారు 42లక్షల విలువైన 825గ్రాముల బంగారు అభరణాలు, 846 గ్రాముల వెండి వస్తువులతో పాటు ఒక ద్విచక్రవాహనం, ఒక ల్యాప్ టాప్ మరియు చోరీ చేసేందుకు వినియోగించిన సాధనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను మహబూబాబాద్ జిల్లా, కొత్తగూడ ప్రాంతానికి చెందిన సునీల్, మహబూబాద్ జిల్లా కురవి ప్రాంతానికి చెందిన లావుడ్యా సాగర్ గా గుర్తించారు. వీరిద్దరూ వరంగల్ అర్బన్ లో నివాసముంటూ చోరీలకు పాల్పడుతున్నట్లుగా పోలీసులు వెల్లడించారు.
చదివింది ఎంబీఏ .. చేసేది చైన్ స్నాచింగ్ .. జల్సాల కోసం ఇద్దరు స్నేహితుల చోరీల బాట !!
బెట్టింగ్ యాప్ లతో క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడిన స్నేహితులు
వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి వెల్లడించిన వివరాల ప్రకారం ఏనుబోతుల సునీల్ చదువు నిమిత్తం జులైవాడలో తన అమ్మమ్మ ఇంటిలో వుంటూ యం.ఎస్సీ కంప్యూటర్స్ సైన్స్ లో పోస్టుగ్రాడ్యూయేషన్ పూర్తి చేశాడని, బెట్టింగ్ యాప్ లను డౌన్లోడ్ చేసుకొని, ఐపిఎల్ క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడుతూ బాగా సంపాదించాడు. ఇక స్నేహితుడైన లావుడ్యా సాగర్ బ్యాంకు ఖాతా ద్వారా, నిందితుడు సాగర్ డెబిట్ కార్డు ద్వారా క్రికెట్ బెట్టింగ్ లావాదేవీలను కొనసాగించేవాడు. క్రికెట్ బెట్టింగ్ లలో నష్టం రావడంతో పాటు తన దగ్గర వున్న డబ్బును బెట్టింగ్ లో పోగోట్టుకోవడంతో లక్షల్లో అప్పుల పాలయ్యాడు సునీల్.
బెట్టింగ్ లతో అప్పులపాలై ఆపై యూ ట్యూబ్ లో వీడియోలు చూసి దొంగలుగా
బెట్టింగ్ ల కోసం అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలని, అప్పులు ఇచ్చిన వారి నుండి ఒత్తిడి ఎదురుకావడంతో సులభంగా డబ్బు సంపాదించాలని, ఆలోచించిన సునీల్, స్నేహితుడు సాగర్ తో కలిసి బీరువా తాళాలు ఏవిధంగా పగలగొట్టాలని యూట్యూబ్ వీడియోల ద్వారా తెలుసుకొని, తాళాలు పగలగొట్టటం నేర్చుకుని దొంగతనాలు మొదలుపెట్టారు. పగలంతా బైక్ పై వెళ్లి తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి, రాత్రి సమయాల్లో తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడుతున్నారు. ఇప్పటి వరకు ఈ తరహాలో మొత్తం వారి 15 చోరీలకు పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు.
వరంగల్ కమీషనరేట్ పరిధిలో మొత్తం 15 చోరీలు
నిందితులు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 15 చోరీలకు పాల్పడ్డాడు. ఇందులో సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో 7 చోరీలకు పాల్పడగా, హన్మకొండ, కెయూసి పరిధిలో రెండు చొప్పున, మట్వాడా, కాజీపేట, చిల్పూర్, ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఒకటి చొప్పున మొత్తం 15 చోరీలకు పాల్పడ్డారు. చోరీ చేసిన బంగారు ఆభరణాలను నిందితులు సుబేదారిలో మణప్పురం గోల్డ్ లోన్ కంపెనీలో కుదవ పెట్టేవారు. ఈ చోరీలపై ప్రత్యేక దృష్టి సారించిన వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు చోరీ జరిగిన ప్రదేశాల్లోని సిసి కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించారు.
బాగా చదువుకున్న యువకులే దొంగలుగా మారుతున్న తీరు
నిందితులు చోరీ సొత్తును మరోమారు సుబేదారిలోని మణిప్పురం గోల్డ్ లోన్ కంపెనీలో కుదువ పెట్టేందుకు వచ్చిన క్రమంలో వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, తమ మార్క్ విచారణ చేయడంతో నిందితులు తాము దొంగతనాలకు పాల్పడినట్లుగా అంగీకరించారు. ఇక ఇటీవల వరంగల్ లోనే ఎంబీఏ చదువుకుని చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న ఇద్దరు స్నేహితులైన చైన్ స్నాచర్లను వేలేరు పోలీసులు అరెస్టు చేసారు. అరెస్టు చేసిన చైన్ స్నాచర్ల నుండి సుమారు 6లక్షల రూపాయల విలువగల 75గ్రాముల మూడు బంగారు పుస్తెల తాళ్ళతో పాటు రెండు ద్విచక్ర వాహనాలు, రెండు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాగా చదువుకున్న విద్యార్థులే దొంగలుగా మారటం ప్రస్తుతం ఆందోళన కలిగించే అంశంగా మారింది.