ఎంజీఎం ఆస్పత్రిని వదిలిపెట్టని ఎలుకలు.. ఐసీయూలో బోన్లు, ర్యాట్ ప్యాడ్లు!!
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఎలుకల బెడద ఇంకా తగ్గలేదు. గతంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పేషెంట్ ను ఎలుకలు కొరికిన ఘటనలో పేషెంట్ మరణించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఆస్పత్రి నిర్వహణపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అప్పటి ఘటనకు బాధ్యులుగా సూపరింటెండెంట్ పై బదిలీ వేటు వేశారు. ఈఘటనకు బాధ్యులైన పలువురు సిబ్బందిపై కూడా వేటు వేశారు. ఆ తర్వాత ఎలుకల నివారణ చర్యలను చేపట్టి హడావిడి చేసిన ఆసుపత్రి అధికారులు మళ్లీ ఎలుకలు వీరవిహారం చేస్తున్న పట్టించుకోవడం మానేశారు.
మళ్ళీ ఎంజీఎంలో స్వైర విహారం చేస్తున్న ఎలుకలు
ఇటీవల వర్ధన్నపేట సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో బల్లి పడిన ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన నేపథ్యంలో బాలికల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి పలు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, ఆసుపత్రిని సందర్శించారు. ఆ సమయంలో ఆసుపత్రిలో ఎలుకలు వీరవిహారం చేయడం గుర్తించారు. ఎంజీఎం ఆస్పత్రి నిర్వహిస్తున్న తీరుపై, తెలంగాణ ప్రభుత్వం పై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. ఆసుపత్రిలో మళ్లీ ఎలుకలు విపరీతంగా తిరుగుతున్నా పట్టించుకున్న నాథుడు లేడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఐసీయూ, ట్రామా కేర్ విభాగంలో గుంపులుగా తిరుగుతున్న ఎలుకలు..
ఐసియూ, ట్రామాకేర్ విభాగంలో ఎలుకలు గుంపులుగా సంచరిస్తున్నాయి అని, అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది అని బిజెపి నేతలు వీడియో పెట్టి మరీ సోషల్ మీడియా ద్వారా ఎటాక్ చేశారు. ఇక ఆసుపత్రుల్లో పేషెంట్ లు సైతం ఎలుకల బెడదతో కంటి మీద కునుకు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పేషెంట్ లపై ఎలుకలు ఎప్పుడు దాడి చేస్తాయో అన్న భయంతో రోగుల బంధువులు భయపడుతున్నారు.
ఎంజీఎం ఆస్పత్రిలో ఎలుకల బోన్లు, ర్యాట్ ప్యాడ్ లు ఏర్పాటు చేస్తున్న సిబ్బంది
ఇక మళ్లీ ఎంజీఎం ఆస్పత్రిలో ఎలుకలు సంచరిస్తున్నాయి అన్న వార్తల నేపథ్యంలో ఆసుపత్రి సిబ్బంది హడావిడిగా ఎంజీఎంలో ఎలకల బోన్ లను ఏర్పాటు చేశారు. ఐసీయూలో బోన్ లను, ర్యాట్ ప్యాడ్ లను ఏర్పాటు చేసి ఎలుకలను పట్టుకోవటం కోసం నానా తంటాలు పడుతున్నారు. కానీ ఎంజీఎం ఆస్పత్రి పరిసర ప్రాంతాల శుభ్రతపై మాత్రం దృష్టి పెట్టటం లేదు. అపరిశుభ్ర పరిసరాలతోనే ఎంజీఎం ఆస్పతిలో ఎలుకల బెడద ఎక్కువైందని అంటున్నారు రోగులు.