శంకర్దాదా ఎంబీబీఎస్: 43వేల మందికి నకిలీ డాక్టర్ వైద్యం.. షాకింగ్ దందా సాగిందిలా!!
వరంగల్: ప్రస్తుతం సమాజంలో ప్రజల ఆరోగ్య అవసరాలను బేస్ చేసుకొని శంకర్ దాదా ఎంబీబీఎస్ లు ఊరికి ఒకరు పుట్టుకొస్తున్నారు. కష్టపడి చదివి, అత్యంత పవిత్రమైన వైద్య వృత్తిని చేపట్టి ప్రజల ప్రాణాలను కాపాడడానికి వైద్యులుగా పని చేయాల్సిన చోట, నకిలీ వైద్యులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఈజీ గా డబ్బు సంపాదించడం కోసం ఎలాంటి విద్యార్హతలు లేకుండా, ఎంబీబీఎస్ చదవకుండా ఎంబీబీఎస్ అని బోర్డులు పెట్టి ప్రజలను మోసం చేస్తున్నారు. తాజాగా అటువంటి ఘటన వరంగల్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
వరంగల్ లో నకిలీ డాక్టర్ గుట్టు రట్టు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు
ఎలాంటి విద్యార్హతలు లేకుండా వైద్యం చేస్తున్న ఓ నకిలీ డాక్టరు గుట్టు వరంగల్ కమిషనరేట్ పోలీసులు రట్టు చేశారు. ఓరుగల్లులో గుట్టు చప్పుడు కాకుండా నకిలీ డాక్టర్ సాగిస్తున్న దందా వ్యహరానికి సంబంధించి టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందడంతో టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ అదనపు డిసిపి వైభవ్ గైక్వాడ్ ఆదేశాల మేరకు నకిలీ డాక్టర్ హస్పటల్ తనీఖీ నిర్వహించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
నకిలీ వైద్యుడితో పాటు అతని సహాయకుడు అరెస్ట్
వరంగల్ నగరంలో ఎలాంటి విద్యార్హత లేకుండానే వైద్యం చేస్తున్న నకిలీ డాక్టర్ తో పాటు అతని సహాయకుడిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసారు. నాలుగేళ్ళలో అతడు 43వేల మందికి వైద్యం చేశాడని గుర్తించారు. అరెస్ట్ చేసిన నకిలీ డాక్టర్ నుండి టాస్క్ ఫోర్స్ పోలీసులు ఒక లక్ష 90 వేల రూపాయల నగదుతో పాటు, ఒక ల్యాప్ ట్యాప్, మూడు సెల్ ఫోన్లు, ల్యాబ్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో వరంగల్ నగరానికి చెందిన ముజతాబా ఆహ్మద్ తో పాటు మరో నిందితుడు దామెరకొండ సంతోష కుమార్ వున్నారు.
నకిలీ సర్టిఫికెట్ తో మోసం... శంకర్ దాదా యం.బి.బి.ఎస్ అవతారం
ఈ అరెస్టు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి వివరాలను వెల్లడిస్తూ పోలీసులు అరెస్ట్ చేసిన నిందితుల్లో ఒకడైన ముజతాబా అహ్మద్ బి.ఫార్మసీ చదువు మధ్యలో ఆపేసి స్థానికంగా వున్న డాక్టర్ వద్ద సహాయకుడిగా కొన్ని సంవత్సరాలు పనిచేశాడని పేర్కొన్నారు . ఆ విధంగా పని చేయడం వల్ల వచ్చిన డబ్బు సరిపోకపోవడంతో మరింత డబ్బును సంపాదించాలనుకున్నాడు. ఇందుకోసం అహ్మద్ శంకర్ దాదా యం.బి.బి.ఎస్ అవతారం ఎత్తాడు. ఆపై నిందితుడు నకిలీ ఎయిమ్స్ వైద్య విభాగం నుండి సర్టిఫికెట్ పొందినట్టు తన పేరు మీదగా నకిలీ సర్టిఫికెట్ తయారు చేసుకుని, ఈ నకిలీ సర్టిఫికెట్ ద్వారా నిందితుడు మరో నిందితుడు ల్యాబ్ టెక్నీషియన్ అయిన సంతోష్ కుమార్ తో కలిసి దందా మొదలు పెట్టాడు.
నకిలీ డాక్టర్ గా వైద్యం .. ల్యాబ్ లో టెస్టులతో భారీగా డబ్బుల వసూళ్ళు
వరంగల్ నగరంలో చింతల్ ప్రాంతంలో హెల్త్ కేర్ ఫార్మసీ పేరుతో 2018 సంవత్సరంలో హస్పటల్ ప్రారంభించి యం.బి.బి.ఎస్ డాక్టర్ గా ప్రజలకు వైద్యం అందించడంతో పాటు, తన ల్యాబ్లోనే వైద్య పరీక్షలు నిర్వహించి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసేవాడు. అదే విధంగా తన ల్యాబ్ లో చేసిన వైద్య పరీక్షలను అసరగా చేసుకోని నిందితుడు చికిత్స కోసం వచ్చిన రోగులను వివిధ జబ్బులు పేరుతో భయభ్రాంతులకు గురిచేసి వారిని నగరంలోని ఇతర ఆసుపత్రులకు పంపించేవాడని తెలిపారు.
రోగులను ఇతర హాస్పిటల్స్ కు పంపి కమీషన్ .. 43వేల మందికి వైద్యం
ఇలా ఇతర హస్పటల్స్ కు రోగులను పంపించినందుకుగాను నిందితుడు సదరు హస్పటల్ యాజమాన్యం నుండి పెద్ద మొత్తంలో కమీషన్లు తీసుకునేవాడని పేర్కొన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా నిందితుడు సుమారు 43వేల మంది రోగులను వైద్యం పేరుతో మోసం చేశాడని పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి వెల్లడించారు. ఇటీవల ఆయన నకిలీ వైద్యుడు అని గుర్తించి పోలీసులకు కొందరు సమాచారం అందించటంతో అతడిని అరెస్ట్ చేశామని పేర్కొన్నారు.