ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కూల్చివేత - మున్సిపల్ అధికారుల డేరింగ్ స్టెప్ - మంత్రి ఆదేశంతో దూకుడు
అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును కూల్చేయడం ద్వారా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్(జీడబ్ల్యూఎంసీ) అరుదైన సాహసాన్ని ప్రదర్శించింది. నాలాను ఆక్రమించి, నిబంధనలు విరుద్ధంగా నిర్మించిన సదరు భవంతిని మున్సిపల్ సిబ్బంది నేలమట్టం చేసిన తీరు ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరంగల్ సిటీ సహా జిల్లా మొత్తం అతలాకుతలమైన నేపథ్యంలో నాలాల విస్తరణ పనులు చేపట్టగా, ఈ సంఘటన చోటుచేసుకుంది.

వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరిది..
టీఆర్ఎస్ నుంచి వర్ధన్నపేట ఎమ్మెల్యేగా గెలుపొందిన అరూరి రమేశ్ కు వరంగల్ సిటీ పరిధిలోనూ ఓ క్యాంప్ ఆఫీస్ ఉంది. హన్మకొండ హంటర్రోడ్డులోని సదరు క్యాంపు కార్యాలయాన్ని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు బుధవారం కూల్చేశారు. వరంగల్ జిల్లా కేంద్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పలు ప్రాంతాలు నీట మునడానికి కారణం.. నాలాలపై నిర్మించిన అక్రమ కట్టడాలే అని నిర్ధారించిన అధికారులు.. వాటిని తొలగించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు.

కలెక్టర్, కమిషనర్ పర్యవేక్షణలో..
హంటర్ రోడ్డులోని నాలాపై వెలసిన అక్రమ నిర్మాణాల్లో వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ క్యాంపు కార్యాలయం కూడా ఉండటంతో.. జిల్లా కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు, కమిషనర్ పమేలా సత్పతి అనుమతి తీసుకునిమరీ డీఆర్ఎఫ్ సిబ్బంది నిర్మాణాలను తొలగించేపనికి ఉపక్రమించింది. కాగా, నాలా విస్తరణ పనుల కోసం తన క్యాంప్ కార్యాలయ భవనాన్ని తొలగించడానికి ఎమ్మెల్యే అరూరి రమేశ్ స్వచ్ఛందంగా ముందుకొచ్చారని ఆయన కార్యాలయం ఓ ప్రకటన చేయడం గమనార్హం.

కేటీఆర్ అలా చెప్పడంతో..
కొద్దిరోజుల కిందట.. వరంగల్ సిటీ వరదలో మునిగిపోయిన వేళ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సిటీలోని ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. నాలాలపై అక్రమ నిర్మాణాల వల్లే ముంపు ఏర్పడిందని ప్రజలు, అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. దీంతో వెంటనే అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని సంబంధిత అధికారులను కేటీఆర్ ఆదేశించారు. అంతేకాదు, నాలాల విస్తరణ పనుల్లో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తావు ఇవ్వరాదని, అధికారపక్షం, ప్రతిపక్షం అనే తేడాలు చూడొద్దని, అక్రమ నిర్మాణం అని తేలితే వెంటనే చర్యలు తీసుకోవాలని జీడబ్ల్యూఎంసీ అధికారులకు స్పష్టత ఇచ్చారు.
Recommended Video

కొనసాగుతోన్న కూల్చివేతలు..
అక్రమ నిర్మాణాలపై సీఎం కేసీఆర్ సీరియస్ గా ఉన్నారని, రాజకీయ ఒత్తిళ్లు లేకుండా పనిచేయాలని మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారని, అందుకే కూల్చివేత పనుల్ని ముమ్మరంగా సాగిస్తున్నామని జీడబ్ల్యూఎంసీ అధికారులు చెప్పారు. వరంగల్ సిటీలోని నాలుగు ప్రధాన నాలాలపై ఫోకస్ పెట్టామని, ఇందులో భాగంగా బుధవారం భద్రకాళి, ములుగు రోడ్డు, నయీంనగర్ నాలాలపై ఉన్న 22 ఆక్రమణలను తొలగించామని, ఇప్పటి వరకు 88 ఆక్రమణలు కూల్చేశామని, ఇకపైనా ప్రక్షాళన పనులు కొనసాగిస్తామని అధికారులు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications