తెలంగాణలో ఏపీ వ్యాపారి దారుణ హత్య: బిజినెస్ పార్ట్నరే హంతకుడు!
ఖమ్మం/పశ్చిమగోదావరి: తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భీమవరంకు చెందిన రొయ్యల వ్యాపారి హత్యకు గురయ్యాడు. దమ్మపేట మండలం అచ్యుతాపురం సమీపంలోని జీడి మామిడి తోటలో మంగళవారం అతని మృతదేహాన్ని గుర్తించారు. ఫిబ్రవరి 11న అదృశ్యమై ఇక్కడ హత్యకు గురికావడం సంచలనంగా మారింది.

11న భీమవరంలో కిడ్నాప్..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంకు చెందిన రొయ్యల వ్యాపారి రెడ్డి కోదండ రామారావు(39) ఫిబ్రవరి 11 నుంచి కనిపించడం లేదని అతని భార్య కళ్యాణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన భీమవరం టూటౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

జీడిమామిడి తోటలో వ్యాపారి మృతదేహం
ఈ క్రమంలో మంగళవారం ఉదయం తెలంగాణలోని కొత్తగూడెం జిల్లా దమ్మపేట సమీపంలోని జీడిమామిడి తోటలో గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అప్పటికే భీమవరం పోలీసులు సర్కిల్ పరిధిలోని పోలీసులకు వ్యాపారి అదృశ్యంపై సమాచారం ఇవ్వడంతో.. గుర్తుతెలియని మృతదేహం గురించి వారికి తెలిపారు. దీంతో అక్కడికి చేరుకున్న భీమవరం పోలీసులు, బాధితుడి కుటుంబసభ్యులు మృతదేహం కోదండరామారావుదేనని గుర్తించారు.

వ్యాపార భాగస్వామే హంతకుండటంటూ భార్య..
రామారావుని అతని వ్యాపార భాగస్వామి వీరస్వామే హత్య చేసివుంటారని ఆయన భార్య కళ్యాణి ఆరోపించారు. కళ్యాణి ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వ్యాపారి హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమని భావిస్తున్నట్లు తెలిపారు. భీమవరంలో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

వ్యాపార లావాదేవీలే హత్యకు కారణమా?
కాగా, విశాఖపట్నంలో రొయ్యల వ్యాపారం నిర్వహించే రెడ్డి రామారావుకి రొయ్యల ఎగుమతికి అవసరమయ్యే ముడి సరుకును సప్లై చేసే పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం దొండ్లపూడి గ్రామానికి చెందిన వీరస్వామితో స్నేహం చేశాడు. ఆ స్నేహంతో వీరస్వామికి కూడా రెడ్డి రామారావు తన వ్యాపారంలో భాగస్వామ్యం ఇవ్వడంతో ఇద్దరూ కలిసి వ్యాపారం చేశారు. అయితే, గత మూడేళ్లుగా వ్యాపార లావాదేవీల విషయాల్లో వీరసవ్ామికి రామారావుకు తరచూ గొడవలు జరుగుతున్నాయి. వీరస్వామి నుంచి తనకు ప్రాణహాని ఉందని రామారావు రెండేళ్ల క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాలుగు రోజుల క్రితం రామారావును తన కారులో తీసుకెళ్లిన వీరస్వామి ఈ హత్యకు పాల్పడ్డాడని ప్రాథమికంగా నిర్ధారించారు. తీసుకెళ్లిన రోజే నిందితుడు రామారావును హత్య చేసినట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications