రఘురామకృష్ణంరాజుపై జగన్ సీరియస్- కఠిన చర్యలు తప్పవని ఉమ్మారెడ్డి హెచ్చరిక...
కొన్ని రోజులుగా వైసీపీ అధినేత జగన్ తో పాటు పార్టీ నేతలపై విమర్శలకు దిగుతున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారశైలిపై ఇవాళ పార్టీ అధిష్టానం సీరియస్ గా స్పందించింది. రఘురామకృష్ణంరాజు ఇలాంటి వ్యాఖ్యలు మానుకోకపోతే కఠిన చర్యలు తప్పవని పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు స్ఫష్టం చేశారు. పార్టీ క్రమ శిక్షణ ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమన్నారు.

రఘురామకృష్ణంరాజుపై వైసీపీ సీరియస్...
పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తూ నిత్యం వైసీపీ నేతలపై వివాదాస్పద వ్యాఖ్యలకు దిగుతున్న ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారంపై అధినేత జగన్ సీరియస్ అయ్యారు. తక్షణం రఘురామకృష్ణంరాజును వెనక్కి తగ్గాలని సంకేతాలు పంపారు. పార్టీ నేతలపై వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని ఆయనకు స్పష్టం చేశారు. రఘురామకృష్ణంరాజు వ్యవహారశైలిపై అధిష్టానం తీవ్ర ఆగ్రహంగా ఉందని సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అసెంబ్లీ సమావేశాలకు హాజరైన సందర్భంగా వెల్లడించారు.

కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక...
కొన్ని రోజులుగా అధినేత జగన్ తో పాటు పార్టీకి చెందిన ఎమ్మెల్యేలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని సీరియస్ గా పరిగణిస్తున్నట్లు ఉమ్మారెడ్డి తెలిపారు. ఇలాంటి చర్యలను ఎట్టిపరిస్దితుల్లోనూ సహించబోమన్నారు. ఎంపీ అయినా, ఎమ్మెల్యేలు అయినా ఎంత పెద్ద నాయకుడైనా పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉండాల్సిందేనన్నారు. రఘురామకృష్ణం రాజు వ్యవహారంలో జగన్ ఎప్పటికప్పుడు అన్ని వివరాలు తెప్పించుకుని కూలంకషంగా చర్చించిన తర్వాతే ఈ హెచ్చరికలు చేస్తున్నట్లు ఉమ్మారెడ్డి వెల్లడించారు.

నోటీసులు లేనట్లే....
పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన ఎంపీ రఘురామకృష్ణంరాజుపై సీరియస్ అయిన వైసీపీ... ఆయనకు నోటీసులు ఇచ్చే విషయాన్ని మాత్రం దాటవేస్తోంది. పార్టీ అధినేతగా జగన్ నేరుగా హెచ్చరికలు చేసిన తర్వాత ఇంకా నోటీసులతో పనేముందని పార్టీ నేత ఉమ్మారెడ్డి ప్రశ్నించారు. దీంతో రఘురామకృష్ణంరాజుకు నోటీసులు ఇచ్చే ఆలోచన వైసీపీలో లేదని తేలిపోయింది. ముందు హెచ్చరికలు చేసి చూడాలని, అప్పటికీ పరిస్ధితిలో మార్పు లేకపోతే తదుపరి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు ఉమ్మారెడ్డి మాటలను బట్టి తెలుస్తోంది.












Click it and Unblock the Notifications