ఎంపీడీవో సంచలన నిర్ణయం... ఒకేసారి 17 మంది గ్రామ వాలంటీర్లపై వేటు...
పశ్చిమగోదావరి జిల్లా దేవరాపల్లి ఎంపీడీవో ఎస్వీఎస్ ప్రసాద్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మండలంలోని 17 మంది గ్రామ వాలంటీర్లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్సార్ చేయూత పథకంలో అనర్హుల గుర్తింపు విషయంలో విఫలమైనందుకు వాలంటీర్లపై వేటు వేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు, విదేశాల్లో ఉన్నవారు వైఎస్సార్ చేయూత పథకానికి అనర్హులు. కానీ దేవరాపల్లి మండలంలోని పలు గ్రామాల్లో అర్హత లేని 21 మంది పేర్లను వాలంటీర్లు లబ్దిదారుల జాబితాలో చేర్చారు. ఈ విషయంపై తీవ్రంగా స్పందించిన ఎంపీడీవో వారిపై వేటు వేశారు. ఇదే అంశానికి సంబంధించి 9 మంది సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్లకు కూడా షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
గ్రామ,వార్డు వాలంటీర్ల వ్యవస్థ ఇటీవలే ఏడాది పూర్తి చేసుకున్న తరుణంలో ఒకేసారి 17 మంది వాలంటీర్లపై వేటు పడటం చర్చనీయాంశంగా మారింది. జగన్ సర్కార్ మేనిఫెస్టో నవరత్నాలను కుల,మత,వర్గ,రాజకీయాలకు అతీతంగా అందరికీ చేరువ చేసే క్రమంలో తీసుకొచ్చిన గ్రామ,వార్డు వాలంటీర్ల వ్యవస్థ కీలక వ్యవహరిస్తోంది.ఈ వ్యవస్థ ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా ఇటీవల సీఎం జగన్మోహన్ రెడ్డి చప్పట్లతో వాలంటీర్లకు అభినందనలు తెలిపిన సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్లో గ్రామ, వార్డు సచివాలయాల్లో మొదటి విడత ఉద్యోగాల భర్తీ గతేడాదే పూర్తి చేయగా... రెండో విడతలో భాగంగా 16,208 ఉద్యోగాలకు ఇటీవలే పరీక్ష నిర్వహించారు.ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రామ,వార్డు సచివాలయ వ్యవస్థతో చాలామంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం లభిస్తోంది.