WTC Final 2023.. బోల్తా కొట్టిన బౌలర్లు- రోహిత్ శర్మ చెత్త ఐడియా
లండన్: భారత్- ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ మ్యాచ్ తొలి రోజు- భారత్ చేతులెత్తేసింది. టీమిండియా బౌలర్లు ఘోరంగా విఫలం అయ్యారు. ఆసీస్ బ్యాటర్ల దూకుడు ముందు తేలిపోయారు. ఇన్నింగ్ ఆరంభంలో కొంతమేర ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ ఆ తరువాత చతికిలపడ్డారు. బ్యాటర్లు రాజ్యమేలారు. టీమిండియా బౌలర్లపై విరుచుకుపడ్డారు.
తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా మూడు వికెట్ల నష్టానికి 327 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ట్రావిస్ హెడ్ సెంచరీ ఊది అవతల పడేశాడు. 22 ఫోర్లు, ఒక భారీ సిక్స్తో 146 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. స్టీవెన్ స్మిత్ సెంచరీకి చేరువయ్యాడు. 95 పరుగులతో క్రీజ్లో ఉన్నాడు. వీరిద్దరూ కలిసి 251 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని అందించారు. రోజంతా భారత బౌలర్లు పడగొట్టింది మూడు వికెట్లే.

లండన్లోని ఓవల్ స్టేడియంలో భారత కాలమానం ప్రకారం.. ఈ మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ఆరంభమైంది. టాస్ గెలిచిన తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది భారత్. ప్రారంభంలోనే ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాను అవుట్ చేసినప్పటికీ ఆ ఒత్తిడిని కొనసాగించలేకపోయారు బౌలర్లు. జట్టు స్కోర్ రెండు పరుగుల వద్ద ఉన్నప్పుడు ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా వికెట్ను కోల్పోయింది ఆస్ట్రేలియా. పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరాడు ఖవాజా.
మహ్మద్ సిరాజ్ సంధించిన గుడ్ లెంగ్త్ బంతిని ఆడటంలో విఫలం అయ్యాడు. బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న ఆ బంతిని వికెట్ కీపర్ కేఎస్ భరత్ అద్భుతంగా అందుకున్నాడు. రెండు పరుగుల వద్దే తొలి వికెట్ను కోల్పోయింది ఆస్ట్రేలియా. మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్, వన్ డౌన్ బ్యాటర్ మార్ముస్ లంబుషేన్.. ఇన్నింగ్ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. రెండో వికెట్కు 69 పరుగులు జత చేశారు.

హాఫ్ సెంచరీకి చేరువైన సమయంలో డేవిడ్ వార్నర్ అవుట్ అయ్యాడు. ఎనిమిది ఫోర్లతో 43 పరుగులు చేసిన వార్నర్ శార్దుల్ ఠాకూర్ బౌలింగ్లో వికెట్ కీపర్ కేఎస్ భరత్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. వార్నర్ అవుట్ అయిన తరువాత లాంబుషేన్ కూడా ఎక్కువ సేపు క్రీజ్లో నిల్చోలేకపోయాడు. జట్టు స్కోర్ జట్టు స్కోర్ 76 పరుగుల వద్ద ఉన్నప్పుడు అతను అవుట్ అయ్యాడు. 26 పరుగులు చేసిన లాంబుషేన్ను మహ్మద్ షమీ క్లీన్ బౌల్డ్ చేశాడు.
అంతే- ఆ తరువాత మరో వికెట్ను పడగొట్టలేకపోయారు. స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్ క్రీజ్లో పాతుకుపోయారు. ఏ ఒక్క బౌలర్ కూడా వారిపై ఏ మాత్రం ప్రభావాన్ని చూపలేకపోయాడు. వారిద్దరి బ్యాటింగ్ శైలి వన్డే ఫార్మట్ తరహాలో సాగిందంటే- టీమిండియా బౌలింగ్ ఎంత నాసిరకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దుల్ ఠాకూర్ ఒక్కో వికెట్ తీసుకున్నారు. రవీంద్ర జడేజా, ఉమేష్ యాదవ్ వికెట్ లెస్గా మిగిలారు.

నలుగురు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగాలనే రోహిత్ శర్మ ఐడియా బెడిసికొట్టిందనేది తేలిపోయింది. స్పెషలిస్ట్ స్పిన్నర్ను తుదిజట్టులోకి తీసుకోలేదతను. అనుభవజ్ఞుడు రవిచంద్రన్ అశ్విన్ అందుబాటులోనే ఉన్నప్పటికీ.. అతన్ని బెంచ్కే పరిమితం చేశాడు. రవీంద్రజడేజా రూపంలో ఒకే ఒక్క స్పిన్ బౌలర్ జట్టులో ఉన్నాడు. నలుగురు పేసర్లతో ఆసీస్ ఆట కట్టించాలనుకుని అదే ఆటకు చిత్తయ్యాడు రోహిత్ శర్మ.












Click it and Unblock the Notifications