యువతరానికి స్ఫూర్తి కన్నబిరాన్, డల్లాస్లో సంస్మరణ

అమెరికా చరిత్రలో పౌరహక్కుల ఉద్యమం లో మార్టిన్ లూధర్ కింగ్ ప్రముఖమైన పాత్ర పోషించారు. భారతదేశ పౌరహక్కుల ఉద్యమాన్ని నిర్మించిన కన్నబిరాన్, 50 సంవత్సరాల కాలం నిరంతరం మానవహక్కుల కోసం పోరాడి, చివరి శ్వాస వరకు ప్రజాస్వామిక విలువల కోసం జీవితాన్ని అంకితం చేసిన సామాజిక విప్లవకారుడు, సామాన్యమైన మానవ వాది, భార్గవ కమీషన్ కు కన్నబిరాన్ సహకరించినందుకు, ప్రభుత్వం నుండి భృతి తీసుకోమని, అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ చెప్పిస్తే, “నాకు డబ్బు అవసరం లేదు, నేను రాజకీయ విశ్వాసాల కోసం ఈ పని చేస్తున్నాను, కానీ పారితోషికం ఆశించి కాదు" అని కన్నబిరాన్ అన్నారు. కన్నబిరాన్ నిర్వచించిన మానవహక్కుల భావజాలాన్ని అధ్యయనం చేస్తూ, ఆయన ఆశయాలను ఆచరణ లో పెట్టాల్సిన అవసరం వుంది.
నర్రిసెట్టి ఇన్నయ్య "భారతదేశ పౌరహక్కుల ఉద్యమంలో కన్నబిరాన్" అంశంపైన ప్రసంగించారు. “భారతదేశం ఒక మూస ప్రజాస్వామ్యంగా దిగజారిన దశలో, ఓటర్లు రాజకీయపార్టీల వ్యవస్థలో చిక్కుకున్నారు. భారత రాజకీయ వ్యవస్థలో కరువైన మానవహక్కులు మరియు పౌరహక్కులు పైన ప్రజలను చైతన్యం చేయడానికి కన్నబిరాన్ కృషి చేసారు. ప్రజాస్వామిక విలువలు కాపాడటానికి కన్నబిరాన్, జస్టిస్ తార్కుండే తో కలసి పనిచేసారు. ప్రజలు మానవహక్కులను అధ్యయనం చేసి, వాటిని ఆచరణలో పెట్టాలి. భారతదేశ సామాజిక విప్లవానికి కన్నబిరాన్ మరణం తీరని లోటు.
అధికార పార్టీని ఎవరైనా విమర్శిస్తే, వాళ్ళ గొంతు నొక్కేస్తారు, లేదంటే చంపేస్తారు. ఎన్నికల ముందు "గౌరవనీయులు ఓటరు వెంకయ్య" అనే పిలిచే రాజకీయ నాయకులు, గద్దెకెక్కిన తరువాత "పోరా బోడి వెంకయ్య" అంటారు. ఎన్నికలలోఅవినీతి బాగా పెరిగిపోయింది. నిజానికి ఎన్ కౌంటర్లు ఎక్కడా జరగటం లేదు. ఎన్ కౌంటర్ల పేరుతో హత్యలే జరుగుతున్నాయి. కన్నబిరాన్ నిజ నిర్ధారణ కమిటీలు వేసి, డాక్టర్లు, లాయర్లు, జర్నలిస్టులు మరియు మానవహక్కుల కార్యకర్తల తో విచారణ చేసి, నిజాలను జనం ముందు పెట్టాడు. ఎన్ కౌంటర్ల పేరుతో జరుగుతున్న హత్యలపైన ప్రభుత్వ యంత్రాంగాన్ని న్యాయస్థానాల ద్వారా నిలదీశాడు. ఎందరో ప్రాణాలను కాపాడాడు. కన్నాభీరాన్ కు వసంత భార్య లభించటం అదృష్టం. ఆమె ఎంతో మందికి చదువు చెప్పి, ఉద్యమ కార్యకర్తలుగా తీర్చిదిద్దారు."
ప్రపంచంలో చాలామంది హింసను, దుర్మార్గాలను మౌనంగా భరిస్తారు. మతకోణంలో పూర్వ జన్మ సుకృతం, కర్మ అనుకుంటారు. మనిషి శాస్త్రీయంగా ఆలోచించటం, కళ్ళముందు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించటం, దుర్మార్గాలను ప్రతిఘటించటం, మానవతా విలువలకు నిలబడటం అవసరం. కమ్యూనిస్టు భావజాలం తో మనం అంగీకరించినా, అంగీకరించక పోయిన మానవహక్కుల కోసం పోరాడటం అవసరం.
వాసిరెడ్డి నవీన్ "మానవహక్కుల ఉద్యమం లో కన్నబిరాన్ ముద్ర" పైన ప్రసంగించారు. “ఆంధ్రప్రదేశ్ లో గత సంవత్సరం కాలం చాలా విషాదమైనది. ఎందుకంటే నలుగురు మానవహక్కుల నాయకులు బాలగోపాల్, శంకరన్ , కన్నబిరాన్ మరియు బుర్రా రాములను కోల్పోయాం. కన్నబిరాన్ ఎంత మేధావో, అంత సామాన్య మానవతావాది. ఎమర్జెన్సీ కాలం తర్వాత “ఆంధ్రప్రదేశ్ లో ఎన్ కౌంటర్ల" పైన విచారణ జరపడానికి జస్టిస్ తార్కుండే కమిటీ వేయడం లో కృషి చేసారు. యీ కమిటీ విధివిధానాలను జయప్రకాశ్ నారాయణ తో చర్చించి, ఆయన సూచనలను పరగణలోకి తీసుకున్నారు.
అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్, ముఖ్యమంత్రి వెంగళరావులు ప్రజల డిమాండ్ తో జస్టిస్ భార్గవ కమిషన్ ను ఏర్పాటు చేసారు. దీనికి ప్రజల మద్దతు కూడ కట్టడంలో కన్నబిరాన్ కీలకమైన పాత్ర పోషించారు. కొన్ని మంచి ఉద్దేశాలతో ఏర్పాటు అయిన జస్టిస్ భార్గవ కమిటీ, చివరికి ప్రభుత్వం, పోలీసుల ఒత్తిడితో చేతులు ఎత్తేసింది. భార్గవ కమిషన్ ఎంత కుటిలంగా వ్యవహరించిందో, అంతకన్నా కుటిలంగా ప్రభుత్వ విధానాలు వున్నాయి. మనం ఎంత చేసినా ప్రభుత్వాలు దిగి వస్తాయని అనుకోవటం కళ్ళ. మనం విప్లవోద్యమాలతో అంగీకరించినా, అంగీకరించకపోయినా, ఎన్ని భిన్నాభిప్రాయాలు వున్నా, మానవహక్కుల కోసం నిలబడవలసిన అవసరం మున్నది. చర్చల కోసం స్వామి అగ్నివేష్ ఉత్తరాన్ని తీసుకుని వెళుతున్న భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) అధికార ప్రతినిధి ఆజాద్, జర్నలిస్టు హేమచంద్ పాండేలను ఎన్ కౌంటర్ల పేరుతో పోలీసులు చంపేశారు. పోలీసుల కాకమ్మ కట్టుకథలను నమ్మడానికి, జనం యిప్పుడు సిద్దంగా లేరు.
ఇంతకీ కన్నబిరాన్, ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం ఏమి సాధించింది? మానవహక్కుల చైతన్యం ప్రజలలో వ్యాప్తి చేయటం లో కన్నబిరాన్ తీవ్రంగా కృషి చేసారు. దళితులు, విద్యార్ధులు, పేద వర్గాల వేల కేసులు కోర్టులలో వాదించి న్యాయం కోసం పోరాడారు. ఒకప్పుడు అరుంధతీ రాయ్ ఒక కథల రచయిత్రి వుండేవారు. ఇప్పుడు ప్రజాసమస్యలు, మానవహక్కుల సమస్యలపైన స్పందిస్తున్న రచయిత్రి. అరుంధతీ రాయ్ పైన కన్నబిరాన్ ప్రభావం కూడ వున్నది. ఆమె స్వయంగా తన ఉపన్యాసాలలో ఎన్నోసార్లు, కన్నబిరాన్ మాటలను ఉదహరించారు. బాలగోపాల్ బాటలో నడిచిన బుర్రా రాములు మానవహక్కుల కోసం నిరంతరం పోరాడాడు. మన కళ్ళముందు జరుగుతున్న అన్యాయలను ప్రశ్నిస్తూ, మానవహక్కుల కోసం పోరాడాలి.
“ప్రజా ఉద్యమాలపైన మిలటరీ ప్రయోగం" పైన సాజీ గోపాల్ ప్రసంగించారు. జెనీవా ఒప్పందాలు, ఐక్య రాజ్యసమితి ప్రకారం, ప్రపంచంలో ఏ దేశమైనా తన సొంత ప్రజలపైన మిలటరీ దాడులు చేయటం, యుద్ధ నేరం,. స్టేట్ ట్రెరరిజం గా పరిగణిస్తారు. భారత ప్రభుత్వం ఛత్తీస్ గఢ్ లోని నారయణపూర్ లో “మిలటరీ జంగిల్ వార్ ఫేర్ “ శిక్షణ పేరుతో మిలటరీని దిప్పింది. రవాణా కోసం యుద్ధవిమానాలు వినియోగిస్తోంది. ఆత్మరక్షణ కోసం మిలటరీ ఎదురు దాడులు చేయవచ్చని చెబుతోంది. ఆత్మరక్షణ కుంటిసాకున ఎన్ కౌంటర్ల పేరు తో వేలాది మంది రాజకీయ ఉద్యమకారులను ప్రభుత్వాలు చంపి వేసాయి. ఆపరేషన్ గ్రీన్ హంటు పోరుతో వేలాది పార మిలటరీ బలగాలను, సి.ఆర్.పి.ఎఫ్, గ్రేహండ్స్, కమాండ్ బలగాలను ప్రజా ఉద్యమాలను అణచివేయడానికి ప్రయోగిస్తోంది. సాల్వజుడుం పేరుతో కాంగ్రెసు కేంద్ర ప్రభుత్వం మరియు ఛత్తీస్ గడ్ రాష్ట్రంలోని బిజెపీ ప్రభుత్వం చెలాయిస్తున్న హంతక ముఠాలను, భారతదేశం అత్యంత వున్నతమైన న్యాయస్థానం సుప్రీం కోర్టు “స్వాలజుడుం" రాజ్యాంగ విరుద్ధమైన తీర్పునిచ్చింది. ప్రజాస్వామిక వాదులుగా మనమంతా, ప్రజా ఉద్యమాలపైన మిలటరీ అణచివేతను వ్యతిరేకించాలి, మానవహక్కుల కోసం ఉద్యమించాలి."
తర్వాత జరిగిన చర్చలో సుబ్రమణ్యం మాట్లాడుతూ “కళ్ళ ముందు జరిగే అన్యాయాలను ప్రశ్నించాలంటే చాలామంది భయపడతారు? కానీ కన్నబిరాన్ అంత ధైర్యంగా ఎలా నిలబడారని? ప్రశ్నలు లేవనెత్తారు. అనంత్ మల్లవరం, నసీం షేక్, రాజేష్, ఈలం తమిళులు మరియు స్వరూప్ పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications