తెలంగాణ ఎన్నారైల కల్చరల్ పరేడ్
తెనా సాంస్కృతిక మార్చ్ కారణంగా న్యూయార్క్ నగరంలో ఆదివారంనాడు త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. భారతదేశంలో వెలుపల స్వాతంత్ర్య దినం సందర్భంగా ఇంత పెద్ద యెత్తున జరిగిన ఉత్సవం బహుశా ఇదే. దాదాపు లక్షా యాభై వేల ముంది ఈ మార్చ్లో పాల్గొన్నారు. ఆగస్టు 15 తర్వాత వచ్చే ఆదివారం యేటా అమెరికాలో భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని నిర్వహించుకోవడం పరిపాటి.
బోస్టన్, వాషింగ్టన్ డిసి వంటి రాష్ట్రాల నుంచి వందలాది మంది ఎన్నారైలు ఈ ఉత్సవాలకు వచ్చి తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబింపజేశారు. తెలంగాణ సాంస్కృతిక ప్రత్యేకతను ఈ సందర్భంగా చాటి చెప్పారు. తీరొక్క రంగుల పూలతో బతుకమ్మలను పేర్చి మార్చ్లో ప్రదర్శించారు. అలాగే బోనాలను కూడా ప్రదర్శించారు కాళీమాతకు ప్రసాదం పెట్టారు. తెలంగాణ సంస్కృతిని, చరిత్రను, కళను ప్రతిబింబించే ప్లకార్డులను ప్రదర్శించారు.
తెలంగాణ ఎన్నారైల సంఘం వెంకట్ మారోజు మాట్లాడుతూ - తెలంగాణ ఉనికి భిన్నమైన సాంస్కృతిక అస్తిత్వంతో ముడిపడి ఉందని అన్నారు. తమ సభ్యుల నుంచి ఈ కార్యక్రమానికి లభించిన స్పందన పట్ల తెనా కోశాధికారి అమర్ కర్మిల్లా సంతోషం వ్యక్తం చేశారు. అతి తక్కువ సమయంలో అద్భుతమైన స్పందనను చూపించారని ఆయన అన్నారు.
బిర్యానీ చేతబూని హైదరాబాదీ ముస్లిం వేషధారణలో సంఘం సభ్యుడు స్రవంత్ పోరెడ్డి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ పరేడ్లో మహిళలు, పిల్లలు పెద్ద యెత్తున పాల్గొని తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే బాధ్యతను నిర్వహించారని ఆయన అన్నారు. మొదటిసారి తెనా ఈ కార్యక్రమంలో పాల్గొన్నదని, తాము ప్రతి యేటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.
తమ సంస్కృతిని ప్రదర్శించడానికి తాము వేదిక కోసం చూస్తున్నామని, తెనా తమకు ఆ అవకాశం కల్పించిందని, అందుకు ఎంతో సంతోషంగా ఉందని సెయిట్ జాన్స్ విశ్వవిద్యాలయం విద్యార్థిని శ్రుతి అన్నారు. పోచంపల్లి, గద్వాల చీరల పోస్టర్లను సభ్యులు ప్రదర్శించారు. నిర్మల్ బొమ్మలు, పెంబర్తి కళాఖండాల పోస్టర్లను కూడా ప్రదర్సించారు. కాపు రాజయ్య చిత్రాలను, చారిత్రక నిర్మాణాలైన కాకతీయ తోరణం, చార్మినార్, రామప్ప, గోల్కొండ కోట వంటివాటిని కూడా ప్రదర్శించారు.
శతాబ్దాల తరబడిగా వాటి గురించి ప్రజలకు తెలుసునని, అవి తెలంగాణ నుంచి వచ్చినవనే విషయం తెలియదని, తమ సంస్కృతినీ ఉనికినీ చాటి చెప్పినందుకు తమకు గర్వంగా ఉందని తెనా చైర్మన్ రవి మేరెడ్డి అన్నారు. విద్య వెంకటయోగ్, వినయ సూరినేని పోచంపల్ల, గద్వాల చీరలతో బతుకమ్మను చేతబూని వచ్చారు. అనిల్ కుంబ్లే, సైఫ్ అలీ ఖాన్ బతుకమ్మలను, పోస్టర్లను గమనించడం తాను చూశానని గోవర్ధన్ తోకల అన్నారు.
అమెరికా ప్రజలు తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన సాంస్కృతిక అనుభవాన్ని అమెరికా ప్రజలు చూసే అవకాశం లభించిందని తెనా న్యూజెర్సీ సభ్యుడు రవి దన్నుపనేని అన్నారు. బతుకమ్మ, బోనాలు, డప్పు నృత్యాలను ప్రేక్షకులు తమ కెమెరాల్లో బంధించారు. వరంగల్ నగరం మేయర్ తక్కపల్లి రాజేశ్వర్ రావు, బిజెపి ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి కూడా ఈ పరేడ్లో పాల్గొన్నారు.