తెలంగాణ అభివృద్ధికి ఎన్నారైలు సిద్ధం
ఈ సందర్భంగా టిసిఎ వ్యవస్థాపకుడు బుచ్చన్న గాజుల మాట్లాడారు. నూతనంగా ఏర్పడబోయే తెలంగాణ రాష్ట్రం దేశంలోని ఇతర రాష్ట్రాలకు ధీటుగా అభివృద్ధి సాధించాలంటే.. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు పన్నుల నుంచి మినహాయింపు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. రాబోయే లోక్సభ ఎన్నికల నుంచి 20ఏళ్లపాటు కేంద్రం తెలంగాణకు పన్నులను మినహాయిస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఆర్థిక సాయం చేయాల్సిన అసవరం ఉందని ఆయన అన్నారు. హైదరాబాద్ రాజధానిగా, పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం బేషరతుగా ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములయ్యేందుకు చాలా మంది ప్రవాస తెలంగాణ వాసులు సిద్ధంగా ఉన్నారని గాజుల బుచ్చన్న తెలిపారు. ఎన్నో ఏళ్ల తెలంగాణ ప్రజల కల అయిన తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ఎన్నారైల సహకారం ఎప్పుడూ ఉంటుందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్న యూపిఏ ప్రభుత్వానికి, తెలంగాణ కోసం పోరాటం చేసిన కాంగ్రెస్ నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.