ఢిల్లీ ఎన్నికలు: కేజ్రీవాల్ పార్టీకి మద్దతు
న్యూయార్క్: త్వరలో జరగనున్న ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి తమ మద్దతు తెలియజేస్తున్నట్లు లోక్ సత్తా పార్టీ అనుబంధ ఎన్నారై సంస్థ పీపుల్ ఫర్ లోక్ సత్తా (పిఎఫ్ఎల్) పేర్కొంది. లోక్ సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో మద్దతు ఇస్తున్నట్లు ఇటీవల ప్రకటించారని పిఎఫ్ఎల్ తెలిపింది.
తమ నేత జయప్రకాశ్ నారాయణ్ ఆదేశానుసారం ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు తెలియజేయడంలో భాగంగా కొన్ని కార్యక్రమాలను చేపట్టినట్లు పిఎప్ఎల్ పేర్కొంది. ఫోన్ కంపెయిన్స్, చర్చలు జరపడం ద్వారా తాము మద్దతు తెలియజేస్తున్నట్లు, ఇందుకోసం తమ ఒక రోజు జీతాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు ఫిఎఫ్ఎల్ సభ్యులు తెలిపారు.

ఇండియాలో అవినీతికి వ్యతిరేకంగా సాగుతున్న పోరాటంలో తాము భాగస్వాములమవుతున్నట్లు, లోక్పాల్ బిల్లుకు మద్దతుగా అమెరికాలోని శాన్ డియాగో నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వరకు సుమారు 240 కిలో మీటర్ల నడక ద్వారా దండి మార్చ్-2ను చేపట్టినట్లు పిఎఫ్ఎల్ సభ్యులు చెప్పారు. అవినీతికి వ్యతిరేకంగా సామాజిక కార్యకర్త అన్నా హజారే, యోగా గురువు బాబా రాందేవ్ చేపట్టిన దీక్షలకు మద్దతుగా తాము కూడా ఉపవాస దీక్షలు చేపట్టినట్లు తెలిపారు.
పిఎఫ్ఎల్ సభ్యత్వ ఉపాధ్యక్షుడు కృష్ణ బురుగుపల్లి మాట్లాడుతూ.. ఆమ్ ఆద్మీ పార్టీ, లోక్ సత్తా పార్టీల మధ్య కొన్ని వ్యత్యాసాలు ఉన్నప్పటికీ భారతదేశంలోని ఇతర పార్టీలకు ఈ రెండు పార్టీలు ప్రత్యామ్నాయంగా ఉన్నాయని తెలిపారు. ఈ రెండు పార్టీలకు దేశంలోని యువత నుంచి భారీ మద్దతు లభిస్తోందని చెప్పారు. ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో విద్యావంతులు, మేధువులైన ఓటర్లు తమకు మేలు చేసే పార్టీకి మద్దతు పలుకుతారని కృష్ణ అన్నారు.












Click it and Unblock the Notifications