రాళ్లబండి మృతి పట్ల తానా దిగ్భ్రాంతి, సంతాపం
న్యూయార్క్: ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ రాళ్లబండి కవితా ప్రసాద్(53) మరణ వార్త విని దిగ్ర్భాంతికి గురైనట్లు ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) పేర్కొంది. 2009లో చికాగాలో జరిగిన తానా సమావేశాల్లో ఆయన పాల్గొన్నారని గుర్తు చేసుకుంది. రాళ్లబండి మృతి సాహితీ లోకానికి తీరని లోటని పేర్కొంది. రాళ్లబండి మృతి పట్ల ఆయన కుటుంబానికి తానా అధ్యక్షుడు మోహన్ నన్నపనేని ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
డాక్టర్ రాళ్లబండి కవితా ప్రసాద్ ఆదివారం కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో ఫిబ్రవరి 24న బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చేరిన రాళ్లబండి.. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. కవితాప్రసాద్కు భార్య, ఇద్దరు కుమారులున్నారు. అవధానిగా, సాహితీవేత్తగా, సాహిత్య విమర్శకుడిగా రాళ్లబండి పండితుల ప్రశంసలందుకున్నారు. పద్య సాహిత్యంపైన పట్టు సాధించిన అరుదైన పండితులలో అగ్రగణ్యుడు కవితాప్రసాద్.
పరిపాలనా దక్షుడుగా, విద్వద్విమర్శకుడిగా ఆయన కీర్తి గడించారు. ఆయన మరణవార్త తెలిసిన సాహితీవేత్తలు, పండితులు, విద్వాంసులు దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. కృష్ణా జిల్లా నెమలి ఆయన స్వస్థలం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవధాన విద్యను ప్రచారం చేయడంలో, అవధానాలు నిర్వహించడంలో ఆయన కీలక భూమిక పోషించారు.
ఉస్మానియా విశ్వ విద్యాలయంనుంచి అవధాన విద్యపైన ఆయన డాక్టరేట్ తీసుకున్నారు. ఆయన రచించింన ఒంటరి పూల బుట్ట, పద్య మండపం, అగ్నిహింస, ఇది కవి సమయంవంటి గ్రంథాలు విస్తృత ప్రాచుర్యాన్ని పొందాయి.
సుమారు ఆరు సంవత్సరాలుపాటు సాంస్కృతిక శాఖకు ఆయన డైరెక్టర్గా వ్యవహరించారు. సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ పదవి నిర్వహించారు. హాస్టళ్ల కుంభకోణంపై విచారణ జరిపి, ప్రామాణికమైన నివేదికను గత ప్రభుత్వానికి అందజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం భద్రాచలం, యాదగిరి గుట్ట తదితర క్షేత్రాలలో జరిగిన కళ్యాణోత్సవాలకు ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరించారు