పార్కింగ్ కోసం ఘర్షణ: ఇద్దరు ఎన్నారైల హత్య
జోహన్నెస్బర్గ్: పార్కింగ్ స్థలం కోసం జరిగిన గొడవ ఘర్షణకు దారి తీసి ఇద్దరు ప్రవాస భారతీయుల మరణానికి కారణమైంది. ఓ వ్యక్తి పార్కింగ్ స్థలంలో గొడవపడి ఇద్దరు భారతీయులను కాల్చి చంపాడు. ఈ ఘటన దక్షిణాఫ్రికాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. డర్బన్లోని ఓ అపార్ట్మెంట్లో భారత సంతతికి చెందిన సోదరులు అహ్మద్ వావ్దా(25) అకౌంటెంట్గా, మొహమద్ వావ్దా(31) ఎస్టేట్ ఏజెంట్లుగా పని చేస్తున్నారు.
ఆ అపార్ట్మెంట్లోని మరో వ్యక్తితో వీరిద్దరికీ రోజూ పార్కింగ్ స్థలంపై వివాదం జరుగుతుండేది. కాగా, గత ఆదివారం అహ్మద్, అతని భార్య కారు పార్క్ చేసి వెళుతుండగా ఆ వ్యక్తి అహ్మద్ను కాల్చేశాడు.
గమనించిన అహ్మద్ సోదరుడు కిందికి రాగా, అతడ్ని కూడా కాల్చేశాడు. దీంతో వీరిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. కాగా, వీరి మధ్య పార్కింగ్ విషయమై రోజూ గొడవలు జరుగుతుండేవని స్థానిక చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, నిందితుడ్ని అరెస్ట్ చేశారు.