లోకమెరిగిన పండితుడు ఇక లేరు
సంస్కృత వాజ్ఞయాన్ని ఔపోషణ పట్టిన పండితుడు, బహుభాషావేత్త డాక్టర్ ముదిగంటి గోపాల్రెడ్డిని మృత్యువు కబళించింది. ఆయన ఏప్రిల్ నాలుగవ తేదీన కన్నుమూశారు. పద్నాలుగు భాషల్లో పండితుడైన గోపాల్ రెడ్డి పందొమ్మిది వందల ముప్పై ఆరు ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీన కరీంనగర్ జిల్లా పొత్తపల్లి గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి ముదిగంటి కొండల్రెడ్డి హైదరాబాద్ రాష్ట్రంలో శాసనసభ్యుడిగా పని చేశారు.
కొండల్ రెడ్డి ఆర్యసమాజ సిద్ధాంతాలకు ప్రభావితుడై వాటిని ఆచరణలో పెట్టారు. ఆ లక్షణాలనే గోపాల్ రెడ్డి పెంచి పోషించాయి. గోపాల్రెడ్డిని తండ్రి పందొమ్మిది వందల నలబై రెండులో హరిద్వార్ సమీపంలోని గంగాతీరంలో స్వామి శ్రద్ధానంత స్థాపించిన ప్రసిద్ధమైన కాంగిడి గురుకులానికి పంపించారు. దీంతో ఆయన రచించిన చార్వాక, బౌద్ధ, జైనం, సక్త సంస్కృతం, భారతీయ తత్వశాస్త్రం, నాస్తిక దర్శనాలు చదివారు. పాశ్చాత్య తత్వశాస్త్రాన్ని అధ్యయనం చేశారు. ఆ గురుకులం నుంచే ఆయన 'వేదాలంకార' డిగ్రీ పొందారు.
పద్నాలుగు భాషలలో గోపాల్ రెడ్డి పారంగతుడు. నాలుగు వేదాలతో పాటు శిక్షకల్పం, వ్యాకరణం, నిరుక్తం, జ్యోతిషం, ఛందస్సుతో కూడిన వేదాంగాలు, మీమాంస, న్యాయ ధర్మశాస్త్రాలు, పురాణాలు అధ్యయనం చేశారు.
సంపన్న కుటుంబంలో నుంచి వచ్చిన సుజాతారెడ్డిని ఆయన వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత ఆమె ఎం. ఎ. చదివి డాక్టరేట్ పట్టా పొందారు. ఆమె విద్యావంతురాలిగా, కథారచయిత్రిగా, విమర్శకురాలిగా ఎదగడంలో గోపాల్రెడ్డి కృషి ఎంతో ఉంది. ఆమెతో కలిసి ఆయన అత్యంత ప్రామాణికంగా వెయ్యేళ్ల 'సంస్కృత సాహిత్య చరిత్ర' రాశారు. గోపాల్రెడ్డి పందొమ్మిది వందల అరవై నాలుగు ప్రాంతంలో జర్మనీలోని గోథే ఇనిస్టిట్యూట్, కుబింగన్ యూనివర్శిటీలలో పరిశోధనలు చేశారు. దాంతో పాటు ఆయన ఇండాలజీ విభాగంలో సంస్కృతం, హిందీ భాషలను బోధించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సంస్కృత విభాగంలో పని చేశారు. ఉస్మానియా యూనివర్శిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్గా పని చేశారు.
తెలుగు భాషలో వాడకంలో నలబై వేలకు పైగా ఉన్న సంస్కృత భాషా ధాతువులను క్రోడీకరించి, వాటి వ్యుత్పత్తిని చేప్పే ప్రత్యేక కోశాన్ని ఆయన సిద్ధం చేశారు. ఆయన మరణం ఎందరో జిజ్ఞాసువులకు తీరని లోటు. ఎందరెందరో విద్వాంసులు సందేహాలు తీర్చుకోవడానికి గోపాల్ రెడ్డి వద్దకు వచ్చేవారు. వారందరినీ వదిలేసి ఆయన వెళ్లిపోయారు. అశేష పాండిత్యాన్ని ఔపోషణ పట్టిన గోపాల్రెడ్డి గర్వం ఏ మాత్రం కనిపించేది కాదు. నిరాడంబర జీవి. నవ్వుతూ పలకరించే ఒక స్నేహశీలిని హైదరాబాద్ పోగొట్టుకుంది.